ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత యువ క్రికెటర్ పృథ్వీ షా కీలక నిర్ణయం తీసుకున్నాడు

sports |  Suryaa Desk  | Published : Tue, Jun 24, 2025, 10:10 AM

భారత యువ క్రికెటర్ పృథ్వీ షా కీలక నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ముంబై క్రికెట్ జట్టుతో తన బంధాన్ని తెంచుకున్నాడు. "క్రికెటర్‌గా తన ఎదుగుదల, అభివృద్ధి కోసం" మరో దేశవాళీ జట్టుకు మారేందుకు వీలుగా ముంబై క్రికెట్ అసోసియేషన్  నుంచి సోమవారం ఎన్‌ఓసీ పొందాడు. కొంతకాలంగా భారత టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన పృథ్వీ షా, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అడపాదడపా అవకాశాలు అందుకుంటున్నాడు. అయితే, మైదానంలో ప్రదర్శన కంటే ఆయన మైదానం వెలుపలి క్రమశిక్షణారాహిత్య సమస్యలే ఎక్కువగా చర్చనీయాంశమయ్యాయి.పృథ్వీ షా నుంచి వచ్చిన అభ్యర్థనను తాము ఆమోదించినట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్  అధికారికంగా ధ్రువీకరించింది. "క్రికెటర్ పృథ్వీ షా రాబోయే దేశవాళీ సీజన్‌లో మరో రాష్ట్రం తరఫున ప్రొఫెషనల్ ప్లేయర్‌గా ప్రాతినిధ్యం వహించేందుకు ఎన్‌ఓసీ కోసం అధికారికంగా అభ్యర్థించారు. తగిన పరిశీలన అనంతరం, ఎంసీఏ ఈ ఎన్‌ఓసీని మంజూరు చేసింది" అని ఎంసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ఎంసీఏ కార్యదర్శి అభయ్ హడప్ మాట్లాడుతూ, "పృథ్వీ షా అసాధారణ ప్రతిభావంతుడు. ముంబై క్రికెట్‌కు గణనీయమైన సేవలు అందించాడు. అత‌ని నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. అత‌ని భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.కాగా, ఎంసీఏకు రాసిన లేఖలో 25 ఏళ్ల పృథ్వీ షా తనకు ఇన్నాళ్లూ అవకాశాలు కల్పించి, మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. 2017లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన అత‌డు "ఎంసీఏ వ్యవస్థలో భాగం కావడం నిజంగా గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ నేను పొందిన అనుభవం, గుర్తింపునకు కృతజ్ఞుడను" అని పేర్కొన్నాడు. జట్టును వీడటానికి గల కారణాలను వివరిస్తూ, "నా కెరీర్‌లో ఈ దశలో మరో రాష్ట్ర అసోసియేషన్ తరఫున ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేందుకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇది క్రికెటర్‌గా నా ఎదుగుదల, అభివృద్ధికి మరింత దోహదపడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ నేపథ్యంలో రాబోయే దేశవాళీ సీజన్‌లో కొత్త రాష్ట్ర అసోసియేషన్‌కు అధికారికంగా ప్రాతినిధ్యం వహించడానికి వీలుగా నాకు ఎన్ఓసీ జారీ చేయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ నిర్ణయం చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఎంసీఏ పట్ల అత్యంత గౌరవంతో తీసుకున్నది. ఇన్నేళ్లుగా నాకు మార్గనిర్దేశం చేసి, వేదిక కల్పించినందుకు అసోసియేషన్‌కు ఎప్పటికీ కృతజ్ఞుడనై ఉంటాను" అని షా తన లేఖలో తెలిపాడు. అయితే, షా ఏ జట్టులో చేరబోతున్నాడ‌నే విషయం ఇంకా తెలియరాలేదు.ఇక‌, భారత్ తరఫున ఐదు టెస్టులు, ఆరు వన్డేలు ఆడిన పృథ్వీ షాను గతేడాది పేలవమైన ఫిట్‌నెస్, క్రమశిక్షణారాహిత్యం కారణంగా ముంబై రంజీ జట్టు నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆ రంజీ ట్రోఫీ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమైన షా, చివరిసారిగా మధ్యప్రదేశ్‌తో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఫైనల్‌లో ముంబై తరఫున ఆడాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa