ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. సచివాలయం వేదికగా జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతిలో మౌలిక వసతుల కోసం అదనంగా భూసమీకరణ చేయాలని నిర్ణయించింది. మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో అమరావతిలో మరోసారి భూసమీకరణ చేయాలని నిర్ణయించారు. ఒకే రకమైన రూల్స్తో భూసమీకరణ చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అలాగే అమరావతిలో పలు సంస్థలకు భూకేటాయింపులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
మున్సిపల్ శాఖలో 40 బిల్డింగ్ ఇన్స్ట్రక్టర్ల పోస్టుల అప్గ్రేడ్కు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అలాగే రాష్ట్రంలో మరో 9 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.మరోవైపు తిరుపతి జిల్లా వడమాలపేటలో 12.07 ఎకరాల భూమిని పర్యాటకశాఖకు బదిలీ చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అలాగే భవన నిర్మాణ చట్టంలో నిబంధనల సవరణకు ఆమోదం తెలిపింది. వీటితో పాటుగా స్పోర్ట్స్ కోటా కింద టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
మరోవైపు టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయి కంటే ముందు బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు కూడా 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. 2016 రియో ఒలింపిక్స్లో పీవీ సింధు సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. భారత త్రివర్ణ పతాకాన్ని విశ్వ క్రీడా సంబరంలో రెపరెపలాడించారు. ఈ నేపథ్యంలో అప్పట్లో సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఇచ్చి గౌరవించారు.
గొల్లపూడిలోని ఆంధ్రప్రదేశ్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో పీవీ సింధు డిప్యూటీ కలెక్టర్ విధుల్లో చేరారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇప్పుడు మరోసారి టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయికి డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa