రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వ విజయాలను జులై 2వ తేదీ నుంచి ప్రతి ఇంటికీ చేరవేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ఏ ఒక్క కార్యకర్తను విస్మరించేది లేదని, వారి సేవలను తప్పనిసరిగా గుర్తిస్తామని ఈ సందర్భంగా లోకేశ్ హామీ ఇచ్చారు.ఇకపై పార్టీ అధినేత చంద్రబాబు, తాను ప్రతిరోజూ ఐదుగురు ప్రజలు, ఐదుగురు కార్యకర్తలతో నేరుగా మాట్లాడి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ అంతర్గత సమస్యలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటామని లోకేశ్ వెల్లడించారు. "కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. పార్టీ సంస్థాగత విషయాలు, సమస్యలపై చంద్రబాబుతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాను. పది నిర్ణయాల్లో ఒక తప్పు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి పొరపాట్లు జరిగినప్పుడు వివిధ స్థాయిల్లోని నాయకుల ద్వారా మా దృష్టికి తీసుకువస్తే వాటిని సరిదిద్దుకుంటాం" అని ఆయన అన్నారు. గత ఎన్నికలకు ముందు నిర్వహించిన బాబు సూపర్–6, బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ వంటి కార్యక్రమాలతో పాటు ఎన్నికల అనంతరం చేపట్టిన మన టీడీపీ, సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కార్యకర్తలు చురుగ్గా పాల్గొన్నారని ప్రశంసించారు. పార్టీ కార్యకలాపాలను డిజిటల్ విధానంలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి పనిచేసిన వారిని గుర్తించాలన్నదే తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా కేడర్ను మరువకుండా చంద్రబాబు, తాను ప్రతి జిల్లాకు వెళ్లినప్పుడల్లా కార్యకర్తలను కలుస్తున్నామని గుర్తుచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa