వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ రవాణాకు పాల్పడ్డారని, అలాగే పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుల విచారణ నిమిత్తం నెల్లూరు జిల్లా జైలులో ఉన్న కాకాణిని సిట్ అధికారులు ఈరోజు కస్టడీలోకి తీసుకుని, కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్కు తరలించారు.సిట్ డీఎస్పీ రామాంజనేయులు నేతృత్వంలోని బృందం కాకాణిని రెండు రోజుల పాటు విచారించనుంది. ఈ విచారణ ప్రక్రియ మొత్తం ఆయన న్యాయవాది సమక్షంలో జరగనుంది. ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ కేసులో కాకాణి ఏ2 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో విచారణ కోసం కాకాణిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు చేసిన అభ్యర్థనను రెండవ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు ఆమోదించింది. దీంతో బాపట్ల నుంచి వచ్చిన సిట్ అధికారులు నెల్లూరు జిల్లా జైలు అధికారుల నుంచి కాకాణిని తమ కస్టడీలోకి తీసుకున్నారు.గతంలో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులకు సంబంధించి పోలీసులు కాకాణిని మూడు రోజుల పాటు విచారించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన విచారణకు ఏమాత్రం సహకరించలేదని, అధికారులు అడిగిన సుమారు 60 ప్రశ్నలలో కేవలం రెండు మూడింటికి మాత్రమే సమాధానమిచ్చి, మిగిలిన వాటికి తనకు తెలియదని లేదా సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకు కాకాణి ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa