ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిన్‌పింగ్ అత్యంత సన్నిహితుడు జనరల్ మియా హువపై వేటు

international |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 04:43 PM

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సైన్యంలో అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో ఆయన తన అత్యంత సన్నిహితుడు, నమ్మకమైన జనరల్‌పైనే వేటు వేశారు. సెంట్రల్ మిలటరీ కమిషన్‌లో కీలక సభ్యుడైన జనరల్ మియా హువను పదవి నుంచి తొలగిస్తూ పార్లమెంట్‌లో ఓటింగ్ ద్వారా నిర్ణయం తీసుకున్నారు.చైనా అధికారిక వార్తా సంస్థ షిన్హూవా వెల్లడించిన వివరాల ప్రకారం, గతేడాది నవంబరులో మియా హువపై తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు. ఆయనను 14వ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధి హోదా నుంచి కూడా తప్పించాలని మార్చి 14న సెంట్రల్ మిలటరీ కమిషన్ తీర్మానించింది. ప్రస్తుతం చైనా సీనియర్ రక్షణ శాఖ వెబ్‌సైట్‌లోని అధికారుల జాబితా నుంచి మియా పేరు, ఫొటోను పూర్తిగా తొలగించారు. గతంలో ఆయన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ  రాజకీయ సిద్ధాంత విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు.ఒకప్పుడు జిన్‌పింగ్‌కు మియా హువ అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పేరుంది. జిన్‌పింగ్‌ ఫుజియాన్ ప్రావిన్స్‌లో స్థానిక అధికారిగా పనిచేస్తున్న సమయంలో మియా కూడా అక్కడే విధులు నిర్వర్తించారు. వారి మధ్య ఉన్న సాన్నిహిత్యంతోనే జిన్‌పింగ్ స్వయంగా ఆయన్ను అత్యున్నతమైన సెంట్రల్ మిలటరీ కమిషన్‌కు తీసుకువచ్చారు. అలాంటి వ్యక్తిపై వేటు పడటం చైనా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇది కేవలం మియా హువకు మాత్రమే పరిమితం కాలేదు. సైన్యంలో జిన్‌పింగ్ చేపట్టిన అవినీతి వ్యతిరేక ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే డజనుకు పైగా ఉన్నత స్థాయి జనరల్స్‌తో పాటు, రక్షణ రంగ పరిశ్రమలకు చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్‌లపై చర్యలు తీసుకున్నారు. శుక్రవారం వైస్ అడ్మిరల్ లీ హాంగ్జున్‌ను కూడా పార్లమెంటరీ ప్రతినిధి హోదా నుంచి తొలగించారు. ఆయన గతంలో పీఎల్ఏ నేవీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa