ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిరిండియా అనుబంధ సంస్థ ఏఐశాట్స్ నలుగురు సీనియర్ల తొలగింపు

national |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 07:39 PM

విమాన ప్రమాద విషాదం నుంచి దేశం ఇంకా తేరుకోకముందే, ఎయిరిండియా అనుబంధ సంస్థకు చెందిన ఉద్యోగులు కార్యాలయంలో పార్టీ చేసుకోవడం వివాదాస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, ఎయిరిండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రొవైడర్ అయిన ఏఐశాట్స్ వెంటనే స్పందించింది. నలుగురు సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయాలని ఆదేశించింది.జూన్ 12న లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే అహ్మదాబాద్‌లో కుప్పకూలింది. ఎయిర్‌పోర్ట్ సమీపంలోని మేఘాని నగర్‌లోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్‌పై పడటంతో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ విషాదం జరిగిన కొన్ని రోజులకే గురుగ్రామ్‌లోని ఏఐశాట్స్ కార్యాలయంలో కొందరు ఉద్యోగులు పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. విషాద సమయంలో ఉద్యోగుల ప్రవర్తన తగదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనపై ఏఐశాట్స్ యాజమాన్యం తక్షణమే స్పందించింది. కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, "ఏఐ 171 విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఏఐశాట్స్ అండగా ఉంటుంది. మా సిబ్బంది ప్రవర్తనలో కనిపించిన విచక్షణారాహిత్యానికి చింతిస్తున్నాము. ఈ ప్రవర్తన మా సంస్థ విలువలకు పూర్తిగా విరుద్ధం" అని తెలిపారు. బాధ్యులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని, సానుభూతి, వృత్తి నైపుణ్యం, జవాబుదారీతనానికి తమ సంస్థ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.ఈ ఉదంతంలో నలుగురు సీనియర్ అధికారులను రాజీనామా చేయాలని ఆదేశించడంతో పాటు, మరికొంతమంది సిబ్బందికి కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఏఐశాట్స్ సంస్థ టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా లిమిటెడ్, సింగపూర్‌కు చెందిన శాట్స్ లిమిటెడ్ మధ్య 50-50 వాటాలతో ఏర్పడిన జాయింట్ వెంచర్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa