ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ,,,,బంగ్లాదేశ్‌‌కు బిగ్ షాకిచ్చిన మోదీ సర్కార్

national |  Suryaa Desk  | Published : Sat, Jun 28, 2025, 09:18 PM

బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక వైఖరిని అవలంబించడం.. అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులను పట్టించుకోకపోవడంపై ఆ దేశంపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా బంగ్లాదేశ్ నుంచి దుస్తులు, జనపనార దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. జనపనార దిగుమతులను ముంబైలోని నవా షెవా ఓడరేవు ద్వారా మాత్రమే అనుమతిస్తామని తేల్చి చెప్పింది. ఇతర భూ మార్గాలు లేదా సముద్ర మార్గాల ద్వారా అనుమతించబోమని స్పష్టం చేసింది.


బంగ్లాదేశ్‌లో మైనారిటీలు ముఖ్యంగా హిందువుల ఆస్తులు, దేవాలయాలు, వ్యాపారాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నా.. మహ్మద్ యూనస్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే మైనారిటీలపై దాడుల గురించి భారత్ ఎన్నిసార్లు బంగ్లాదేశ్‌కు చెప్పినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో భారత్ ఆ దేశంపై కఠిన చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేలా భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. బంగ్లాదేశ్ నుంచి దుస్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన కొన్ని వారాల తర్వాత.. భారత్ మరోసారి బంగ్లాదేశ్‌కు భారీ దెబ్బ కొట్టింది.


  బంగ్లాదేశ్ నుంచి వచ్చే జనపనార, టెక్స్‌టైల్ ఉత్పత్తుల దిగుమతులను తగ్గిస్తూ.. కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ శుక్రవారం జారీ చేసిన నోటిఫికేషన్‌లో ముంబైలోని నవా షెవా పోర్ట్ తప్ప.. బంగ్లాదేశ్ నుంచి వచ్చే జనపనారను ఏ భూ మార్గం లేదా సముద్ర మార్గాల ద్వారా భారత్‌లోకి అనుమతించబోమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. జనపనార, ఇతర బంగ్లాదేశ్ ఫైబర్ ఉత్పత్తులపై ఈ ఆంక్షలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలుస్తోంది.


ఇక ఇటీవల మే 17వ తేదీన.. భారత్ తన ల్యాండ్ పోర్టుల ద్వారా బంగ్లాదేశ్ దుస్తుల దిగుమతులపై ఆంక్షలు విధించింది. దుస్తులతో పాటు బంగ్లాదేశ్ నుంచి ఈశాన్య భారతదేశానికి ఇతర ఉత్పత్తులు కూడా ల్యాండ్ పోర్టుల ద్వారా నిలిపివేశారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి దిగుమతి అయ్యే జనపనారపై సుంకాలు లేకపోవడంతో గత కొంత కాలంగా దేశంలోని జనపనార పరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలో జనపనార పరిశ్రమకు ఊతం ఇచ్చేలా ఉందని సంబంధిత వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జనపనార మిల్లులతోపాటు రైతులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.


శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఫ్లాక్స్ టో, నూలు వ్యర్థాలు, గార్నెటెడ్ స్టాక్‌తో సహా, జనపనార, ఇతర టెక్స్‌టైల్ బాస్ట్ ఫైబర్‌లు, నేసిన బట్టలు లేదా ఫ్లాక్స్, జనపనార లేదా ఇతర టెక్స్‌టైల్ బాస్ట్ ఫైబర్‌ల బ్లీచ్ చేయని నేసిన బట్టలు ఆంక్షల పరిధిలోకి వచ్చాయి. మన దేశంలో పశ్చిమ బెంగాల్, బిహార్, అస్సాం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, మేఘాలయ వంటి రాష్ట్రాలు జనపనారను ఉత్పత్తి చేస్తున్నాయి. జనపనార పరిశ్రమ మిల్లులు, ఇతర చిన్న యూనిట్లు.. సుమారు 4 లక్షల మంది కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa