ఆంధ్రప్రదేశ్ బీజేపీకి త్వరలో కొత్త సారథి రానున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ రోజు జూన్ 29 ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు అధ్యక్ష ఎన్నికల ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆ తర్వాత గంట పాటు నామినేషన్ల స్క్రూటినీ, సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే జులై 1వ తేదీన పోలింగ్ నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియకు కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించనున్నారు.కాగా, ప్రస్తుత పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గత ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన నేపథ్యంలో పార్టీ సారథిని మార్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష పదవి రేసులో పలువురు కీలక నేతలు ఉన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, పార్టీ కీలక నేతలు నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటంతో బీజేపీ అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం లభిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa