కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని నెల రోజుల పాటు ప్రతి ఇంటికీ తీసుకెళ్లి విజయవంతం చేయాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.టెక్నాలజీతో పనితీరు గుర్తింపనెల రోజుల పాటు జరిగే 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో కుటుంబ సాధికార సారథి నుంచి పొలిట్బ్యూరో సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ఇంటింటి ప్రచారం సందర్భంగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ను 'మై టీడీపీ' యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు. బాగా పనిచేసిన కార్యకర్తలను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గుర్తించి, సత్కరించాలని తెలిపారు. "ఏడాది హనీమూన్ పూర్తయింది, ఇక అందరం కష్టపడి పనిచేయాలి" అని చెబుతూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.ప్రభుత్వ విజయాలు ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని లోకేశ్ అన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 'తల్లికి వందనం' అమలు చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటో తేదీనే పింఛన్లు అందిస్తున్నామని గుర్తుచేశారు. అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని, ఇచ్చిన ప్రతి హామీని పద్ధతి ప్రకారం నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని తెలిపారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు.పార్టీయే సుప్రీం కార్యకర్తలే బలం 2024 ఎన్నికల్లో ఊహించని విజయం వెనుక కార్యకర్తల కష్టం ఎంతో ఉందని లోకేశ్ కొనియాడారు. క్లస్టర్, యూనిట్, బూత్ (కబ్) వ్యవస్థ వల్లే పార్టీ క్షేత్రస్థాయిలో బలపడిందని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేధింపులు, అక్రమ కేసులు ఎదుర్కొని, జైళ్లకు వెళ్లిన కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ మరువద్దని ఎమ్మెల్యేలు, మంత్రులకు సూచించారు. పార్టీయే సుప్రీం అని, ప్రపంచం మొత్తం తిరిగినా మనందరం తిరిగి వచ్చేది దేవాలయం లాంటి పార్టీ కార్యాలయానికే అని ఆయన ఉద్ఘాటించారు.సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని లోకేశ్ ఆదేశించారు. జూలై 5వ తేదీలోగా క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీలతో పాటు అనుబంధ విభాగాల నియామకాలు పూర్తి చేయాలని డెడ్లైన్ విధించారు. మహిళలను ప్రోత్సహించేందుకు ‘కబ్’ వ్యవస్థలో కో-కన్వీనర్ పదవిని సృష్టించామని, కమిటీలలో మహిళలు, యువతకు పెద్దపీట వేయాలని సూచించారు. నియోజకవర్గాల్లో సంస్థాగత నిర్మాణంపై ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కుప్పంలో చంద్రబాబు వరుస విజయాలకు ఇదే కారణమని గుర్తుచేశారు.సీనియర్లు, యువత సమన్వయం పార్టీకి నాలుగు దశాబ్దాలుగా సీనియర్లు అండగా నిలిచారని, వారి అనుభవాన్ని విస్మరించకూడదని లోకేశ్ అన్నారు. సీనియర్ల అనుభవాన్ని, యువత శక్తిని జోడించి పార్టీని ముందుకు నడపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పార్టీ పదవుల పంపిణీలో అందరినీ కలుపుకొనిపోతూ దామాషా పద్ధతి పాటించాలని సూచించారు. నియోజకవర్గాల్లో బాగా పనిచేసిన వారిని గుర్తించి ప్రోత్సహించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa