ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెస్టుల్లో అత్యంత వేగంగా 2000 పరుగుల రికార్డుకు చేరువలో జైస్వాల్

sports |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 05:46 PM

టీమిండియా యువ సంచలనం, ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో ఓ అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో ఉన్నాడు. భారత క్రికెట్ దిగ్గజాలైన రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌ల పేరిట ఉన్న ప్రతిష్ఠాత్మక రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. టెస్టు ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 2వేల‌ పరుగులు పూర్తిచేసిన భారత బ్యాటర్‌గా నిలిచే సువర్ణావకాశం అతడి ముందు నిలిచింది.ప్రస్తుతం ఈ రికార్డు ద్రవిడ్, సెహ్వాగ్‌ల పేరిట సంయుక్తంగా ఉంది. వీరిద్దరూ తమ కెరీర్‌లో 40 ఇన్నింగ్స్‌లలో 2000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు. 1999లో న్యూజిలాండ్‌పై ద్రవిడ్ ఈ ఘనత సాధించగా, 2004లో ఆస్ట్రేలియాపై సెహ్వాగ్ దీనిని అందుకున్నాడు. అయితే, 2023 జులైలో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ కేవలం 38 టెస్టు ఇన్నింగ్స్‌లలోనే 52.86 సగటుతో 1,903 పరుగులు సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.ఈ నేపథ్యంలో జులై 2 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌ జైస్వాల్‌కు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో అతను మరో 97 పరుగులు చేయగలిగితే, కేవలం 39 ఇన్నింగ్స్‌లలోనే 2,000 పరుగుల మార్క్‌ను అందుకుంటాడు. తద్వారా ద్రవిడ్, సెహ్వాగ్‌లను వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు.ఇటీవల లీడ్స్‌లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. 159 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి శతకంతో కదం తొక్కాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కేవలం 4 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో నిలకడగా ఆడి ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa