ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.100 కోట్ల రోడ్డు నిర్మాణంలో ఇంత నిర్లక్ష్యమా

national |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 10:40 PM

బీహార్‌లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటికి వచ్చింది. జెహానాబాద్ జిల్లాలో రూ.100 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణంలో దారుణమైన నిర్లక్ష్యం వెలుగు చూసింది. కొత్తగా రోడ్డు వేసిన అధికారులు.. దాని మధ్యలో చెట్లను తొలగించకుండానే వాటి చుట్టూ రోడ్డు వేయడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నడిరోడ్డుపై చెట్లు తొలగించకుండానే కొత్త రోడ్డు వేయడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని.. స్థానికులు, ఆ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర భయభ్రాంతులకు గురి అవుతున్నారు.


పాట్నా-గయా ప్రధాన రహదారిపై జెహానాబాద్‌ జిల్లాలో ఈ రోడ్డును నిర్మించారు. ఇక్కడ 7.48 కిలోమీటర్ల మేర కొత్తగా రోడ్డును విస్తరించారు. సాధారణంగా రోడ్డు విస్తరణ పనులు చేపడితే.. వాటికి అడ్డుగా ఉన్న చెట్లను తొలగించాలి. ఆ తర్వాతే రోడ్డును విస్తరించాల్సి ఉంటుంది. కానీ అధికారులు మాత్రం అలా చేయలేదు. రోడ్డు విస్తరణకు ముందు అటవీశాఖను అనుమతుల కోసం సంప్రదించారు. అయితే చెట్లను తొలగించడానికి 14 హెక్టార్ల భూమిని పరిహారంగా అటవీశాఖ కోరింది. అందుకు అధికారులు ఆ 14 హెక్టార్ల భూమిని ఇవ్వలేకపోయారు. దీంతో అటవీశాఖ చెట్లను తొలగించడానికి అనుమతి ఇవ్వలేదు.


అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో అధికారులు చెట్లను తొలగించకుండానే అలాగే రోడ్డు వేశారు. రోడ్డు మధ్యలో పెద్ద చెట్లు ఉండగా.. వాటి చుట్టూ రోడ్డును వేశారు. దూరం నుంచి చూస్తే ఆ రోడ్డు పచ్చగా అందంగా కనిపిస్తోంది. కానీ దగ్గరికి వెళ్తే మాత్రం అసలు ప్రమాదం తెలుస్తోంది. ఆ రోడ్డు "జిగ్‌జాగ్‌ గేమ్" లా ఉందని వాహనదారులు వాపోతున్నారు.


ఆ రోడ్డుపై చెట్లు ఉండటం వల్ల చాలా ప్రమాదాలు జరిగాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.100 కోట్లతో ప్రమాదకరమైన రోడ్డును నిర్మించిన అధికారులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా జరగరాని పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.


ఇంత జరుగుతున్నప్పటికీ ఇంకా అధికారులు మాత్రం ఆ సమస్యను పరిష్కరించలేదు. రోడ్డు మధ్యలోనే సమస్యను ఉంచారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు చేస్తోందని.. కానీ ఇలాంటి నిర్లక్ష్యపు పనులతో ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని మండిపడుతున్నారు. వెంటనే చెట్లను తొలగించి రోడ్డును మంచిగా వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఈ రోడ్డుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అధికారులపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం రోడ్ల కోసం రూ. వందల కోట్లు ఖర్చు చేస్తోందని.. మరోవైపు అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి చెట్లను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa