రైల్వే టికెట్ ధరలను స్వల్పంగా పెంచుతూ ఇటీవలె భారతీయ రైల్వేలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జులై 1వ తేదీ నుంచి కొత్త ఛార్జీలను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఆ ఛార్జీల పెంపు నేటి (సోమవారం) అర్ధరాత్రి నుంచి అమలు చేయనున్నట్లు రైల్వే శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. కొత్త రైల్వే ఛార్జీలు, టికెట్ బుకింగ్ నిబంధనలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని రైల్వేబోర్డు తేల్చి చెప్పింది. అంతేకాకుండా.. తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ అన్ని జోన్ల మేనేజర్లకు సర్క్యులర్ జారీ చేసింది.
అన్ని రకాల రైళ్లలో ఏసీ కోచ్ల టికెట్ ధరలు
సాధారణ రైళ్ల నుంచి వందే భారత్ రైళ్ల వరకు అన్ని రకాల ఏసీ కోచ్ రైళ్లలో టికెట్ ధరలు కిలోమీటరుకు 2 పైసలు చొప్పున పెంచుతున్నట్లు భారత రైల్వేశాఖ తెలిపింది. ఇందులో చైర్ కార్, 3-టైర్/3-ఎకానమీ, 2-టైర్, ఫస్ట్/ఎగ్జిక్యూటివ్ క్లాస్/ఎగ్జిక్యూటివ్ కోచ్ వంటి అన్ని ఏసీ తరగతులు ఉంటాయి. పెంచిన ఈ రైల్వే టికెట్ ఛార్జీలు వందే భారత్, తేజస్, రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్ సఫర్, అమృత్ భారత్, గతిమాన్, మహామన, జన శతాబ్ది, యువ ఎక్స్ప్రెస్, అంత్యోదయ, ఏసీ విస్టాడోమ్ కోచ్లు వంటి అన్ని ప్రీమియం, స్పెషల్ సర్వీసులకు వర్తిస్తాయని తెలిపింది.
అయితే రిజర్వేషన్ ఛార్జీలు, సూపర్ఫాస్ట్ సర్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న టికెట్లకు పెరిగిన ఛార్జీల ధరలు వర్తించవని తెలిపింది. వాటి అసలు ధరలే చెల్లుబాటు అవుతాయని తేల్చి చెప్పింది. అదే సమయంలో సబర్బన్ ప్రయాణాల ఛార్జీలు, సీజన్ టికెట్ల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని రైల్వే శాఖ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa