ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో ఆదివారం గుండిచా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు చనిపోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ నివాసం ఎదుట నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రయత్నించాయి. ఈ సమయంలో చోటుచేసుకున్న ఓ సంఘటన తీవ్ర వివాదానికి దారి తీసింది. సీఎం ఇంటి వద్ద సెక్యూరిటీ అధికారిగా ఉన్న భువనేశ్వర్ ఏసీపీ నరసింఘ భోల్.. నిరసనకారుల కాళ్లు విరగ్గొడితే రివార్డు ఇస్తానని పోలీసులతో అనడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఏసీపీ నరసింఘ భోల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మరోవైపు.. ఈ తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ పూరీ జిల్లా కలెక్టర్, ఎస్పీలను బదిలీ చేస్తూ ఒడిశా సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై 30 రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించనున్నారు.
సీఎం ఇంటి ముందు ఉన్న బారికేడ్ల వద్ద కాపలాగా ఉన్న పోలీసులకు భువనేశ్వర్ ఏసీపీ నరసింఘ భోల్ ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. జగన్నాథ రథయాత్రకు అధికారులు సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని.. కాంగ్రెస్ శ్రేణులు సీఎం నివాసం ఎదుట నిరసన తెలిపాయి. ఈ నేపథ్యంలో సీఎం ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. "ఎవరైనా ఇక్కడికి వస్తే కాళ్లు విరగ్గొట్టండి. అలా చేసిన వారికి రివార్డు ఇస్తాను" అని ఏసీపీ నరసింఘ భోల్ సిబ్బందికి చెప్పారు. "పోలీసులు ఎవరినీ పట్టుకోవాల్సిన అవసరం లేదు, దూరంలో ఉండి కాళ్లు విరిగిన వారిని తానే పట్టుకుంటాను" అని ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే తాను మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ కావడంపై ఏసీపీ నరసింఘ భోల్.. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ జరిగే నిరసనను, తమ విధులను పట్టించుకోకుండా ప్రతి విషయాన్ని మీడియా వైరల్ చేస్తే తాము ఎలా పనిచేయాలంటూ ప్రశ్నించారు. సీఎం ఇంటి ముందు ఆందోళన చేస్తే.. నిరసనకారులను అడ్డుకోవడం తమ డ్యూటీ అని తెలిపారు. కొందరు నిరసనకారులు బారికేడ్లను దాటి సీఎం ఇంటి వైపు వెళ్తుండటంతో వారిని అడ్డుకోవాలని సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు ఒక్కోసారి లాఠీఛార్జ్ చేయాల్సి వస్తుందని.. అవన్నీ తమ విధుల్లో భాగమని తేల్చి చెప్పారు.
మరోవైపు.. పూరీ జగన్నాథ రథయాత్రలో జరిగిన తొక్కిసలాటపై ఒడిశా ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్, పూరీ ఎస్పీ వినిత్ అగర్వాల్లను ట్రాన్స్ఫర్ చేసింది. ఈ ఘటనపై 30 రోజుల్లో పూర్తిస్థాయి నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తామని ఒడిశా న్యాయశాఖ మంత్రి తెలిపారు. అధికారులు తగిన చర్యలు చేపట్టకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని భక్తులు కూడా ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa