జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్తో భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్లో భారత్ భారీగా ఉగ్రహాల సహాయం తీసుకుంది. ఇస్రో కార్టోశాట్ సిరీస్ ఉపగ్రహాలతో పాటు వీదేశీ శాటిలైట్స్ మద్దతు కూడా తీసుకుంది. ఆపరేషన్ సమయంలో ఇవి అందించిన డేటా ఆధారంగా పక్కా ప్లాన్ వేసి.. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్ర శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో నిఘాను మరింత బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 52 మిలిటరీ ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ శాటిలైట్ ప్రయోగాలను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్చిన ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.26,968 కోట్లు కేటాయించింది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్, హిందూ మహాసముద్ర ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టులో ప్రైవేటు భాగస్వామ్యానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీన్ని ‘స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్’ మూడో దశ కింద చేపట్టనున్నారు. ఇందులో భాగంగా, ఇస్రో 21 ఉపగ్రహాలను ప్రయోగించనుంది. మిగిలిన 31 ఉపగ్రహాలను మూడు ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చేసి.. కక్ష్యలోకి ప్రవేశపెడతాయి. దీనివల్ల ప్రైవేట్ రంగంలో అంతరిక్ష పరిశోధనలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది.
తొలి ఉపగ్రహాన్ని ఏప్రిల్ 2026లో కక్ష్యలోకి ప్రవేశపెడతారు. 2029 చివరినాటికి మొత్తం 52 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. అత్యవసర సమయాల్లో వేగంగా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వీలుగా ఇస్రో తన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సాంకేతికతను ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయనుంది.
ప్రస్తుతం చైనా అంతరిక్షంలో తన ఆధిపత్యాన్ని విస్తరింపజేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో, భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా చాలా కీలకంగా మారనుంది. ఈ శాటిలైట్స్ ‘లోఎర్త్’, ‘జియో స్టేషనరీ’ కక్ష్యలలోకి ప్రవేశపెడతారు. వీటి ద్వారా చైనా ‘యాంటీ శాటిలైట్’ సామర్థ్యానికి ధీటుగా బదులిచ్చే అవకాశం ఏర్పడుతుంది. అయితే ప్రయోగాల టైమ్లైన్ను మరింత తగ్గించాలని ఇప్పటికే ఒప్పందం చేసుకున్న మూడు ప్రైవేటు సంస్థలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఉపగ్రహాల నిర్మాణం వేగవంతం చేయమని చెప్పినట్లు సమాచారం.
ఈ ప్రాజెక్టును ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ పరధిలోని డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ పర్యవేక్షిస్తుంది. ఈ ప్రయోగాల ద్వారా భారత్ తన సైనిక శక్తిని అంతరిక్షంలో మరింత పటిష్టం చేసుకోనుంది. భవిష్యత్తులో దేశ రక్షణ వ్యవస్థకు ఈ ప్రాజెక్టు ఒక బలమైన పునాది వేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa