ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డు చట్టం విషయంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు అనుసరించిన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ఓడించి తీరాలని ఏపీ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టాన్ని వైసీపీ స్పష్టంగా వ్యతిరేకించిందని, అయితే టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం దానికి మద్దతు పలికాయని ఒవైసీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా ఈ చట్టాన్ని అమలు చేసిందని ఆయన మండిపడ్డారు. ఈ చట్టానికి మద్దతివ్వడం ద్వారా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ముస్లింల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ రెండు పార్టీల మోసపూరిత మాటలను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కూడా ఒవైసీ విమర్శలు చేశారు. చంద్రబాబు పదేపదే అమరావతి గురించి మాట్లాడుతున్నారని, కానీ రాజధాని నిర్మాణ పనుల్లో ఎందుకు వేగం పెంచడం లేదని ప్రశ్నించారు. కేవలం మాటలకే పరిమితం అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి పార్టీలకు, నాయకులకు స్థానిక ఎన్నికల నుంచే ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని ఓడించాలని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa