ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్ కార్పొరేషన్ అధికారిపై దాడికి పాల్పడిన దుండగులు

national |  Suryaa Desk  | Published : Tue, Jul 01, 2025, 06:30 PM

ప్రభుత్వ కార్యాలయంలోనే ఓ ఉన్నతాధికారిపై కొందరు యువకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిందీ ఘటన. మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అదనపు కమిషనర్ రత్నాకర్ సాహు ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహిస్తుండగా, దుండగులు ఆయన చాంబర్‌లోకి దూసుకొచ్చి దాడి చేశారు. బూతులు తిడుతూ, కాలర్ పట్టుకుని కార్యాలయం బయటకు లాక్కెళ్లారు. బీఎంసీ కార్యాలయంలో నిన్న అదనపు కమిషనర్ రత్నాకర్ సాహు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆరుగురు యువకులు ఒక్కసారిగా ఆయన చాంబర్‌లోకి ప్రవేశించారు. అక్కడున్న సిబ్బంది, సందర్శకులు చూస్తుండగానే సాహుపై పిడిగుద్దులు కురిపించారు. ఆయన్ను అసభ్య పదజాలంతో దూషిస్తూ, చొక్కా కాలర్ పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లి దాడి చేశారు. ఈ అకస్మాత్తు పరిణామంతో కార్యాలయంలోని వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.ఈ దాడి ఘటనపై రత్నాకర్ సాహు మీడియాతో మాట్లాడారు. "కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో నేను ప్రజా సమస్యలపై సమీక్ష చేస్తున్నాను. ఇంతలో కార్పొరేటర్ జీవన్ బాబు, మరో ఐదారుగురు వ్యక్తులు నా వద్దకు వచ్చారు. 'జగా భాయ్‌తో ఏమైనా తప్పుగా ప్రవర్తించావా?' అని జీవన్ బాబు నన్ను ప్రశ్నించారు. నేను అలాంటిదేమీ చేయలేదని చెప్పాను. ఆ వెంటనే వాళ్లు నాపై చేయి చేసుకుని, కారులోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. నాపై దాడి చేసిన వాళ్లు ఎవరో నాకు తెలియదు. దాడికి అసలు కారణం ఏమిటో కూడా అర్థం కావడం లేదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాను" అని ఆయన వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa