అమ్మ కోసం ఓ పదేళ్ల బాలుడు చేసిన ప్రయత్నం ఫలించింది. ఆ నాలుగో తరగతి బుడ్డోడు ధైర్యంగా వేసిన ఒక్క అడుగు.. తల్లి కళ్లల్లో ఆనందం నింపింది. నిస్సాయ స్థితిలో చచ్చిపోదాం అంటూ ఆ అమ్మ నోటి నుంచి వచ్చిన మాటకు తల్లడిల్లిపోయి ఏదో ఒకటి చేయాలన్న కొడుకు తపన.. కూలిపోయిన వారి జీవనాధారాన్ని మళ్లీ నిలబెట్టింది. చిన్నారి ఇచ్చిన ఒక్క అర్జీతో.. కుటుంబాన్ని కమ్ముకున్న నిరాశ దూరమై.. మళ్లీ బతుకు బండినిలాగే ఆత్మస్థైర్యం దొరికింది.
సోమవారం రోజున గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి యశ్వంత్ అనే నాలుగో తరగతి బాలుడు రావటం అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. జీజీహెచ్ దగ్గర తన తల్లి నడిపే టిఫిన్ బండిని కొందరు అధికారులు తొలగించి కాలువలో పడేశారని.. ఎన్ని సార్లు ఆఫీసులకు తిరిగినా, ఎంత మందిని కలిసినా పట్టించుకోవటం లేదని.. ఉన్న ఒక్క జీవనాధారం కోల్పోయిన బాధలో తన తల్లి చచ్చిపోదాం అంటోదంటూ యశ్వంత్ చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి.
తల్లి గురించి ఆ చిన్నారి పడుతున్న తపన, ధైర్యంగా చేసిన ప్రయత్నం తెలుసుకుని కలెక్టర్ నాగలక్ష్మి చలించిపోయారు. వెంటనే యశ్వంత్ను పిలిపించుకుని సమస్య గురించి తెలుసుకున్నారు. బాలుడు ఇచ్చిన ఫిర్యాదుపై గంటల వ్యవధిలోనే స్పందించి.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారి ఏకైక జీవనాధారమైన టిఫిన్ బండిని.. మళ్లీ అదే స్థానంలో పెట్టుకునేందుకు అనుమతించాలని.. అధికారులకు కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. దీంతో.. అధికారులు వెంటనే రంగంలోకి దిగి తొలగించిన బండిని మళ్లీ యశ్వంత్ తల్లికి అప్పగించారు. తన కొడుకు చేసిన ప్రయత్నం ఫలించి.. మళ్లీ టిఫిన్ బండి పెట్టుకునేందుకు అధికారులు అనుమతించటంతో ఆ తల్లి కళ్లలో ఆనందం నిండింది. తమకు న్యాయం చేసిన అధికారులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.
అమ్మ బాధ చూడలేక ఆ నాలుగో తరగతి పిల్లాడు చేసిన ప్రయత్నం ఫలించటంతో.. కేవలం ఆ తల్లి కళ్లలోనే కాదు ఈ విషయం తెలిసి కదిలిపోయిన ప్రతీ మనసు ఆనందంతో నిండిపోయింది. శెభాష్ యశ్వంత్.. ఆ తల్లి దృష్టిలో నువ్వు రియల్ హీరో.. రియల్ రాఖీ భాయ్.. అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఏం జరిగిందంటే..
సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి భుజానికి స్కూలు బ్యాగ్తో, చేతిలో పేపర్తో యశ్వంత్ అనే ఓ పదేళ్ల బాలుడు వచ్చాడు. తన పేరు యశ్వంత్ అని.. తాను నాలుగో తరగతి చదువుతున్నానని అక్కడున్న మీడియాతో తన వివరాలు పంచుకున్నాడు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తన అమ్మ టిఫన్ బండి పెట్టుకుందని.. అయితే కొంతమంది అధికారులు టిఫిన్ బండిని తీసేశారని.. కాలువలో పడేశారంటూ తన బాధ చెప్పుకున్నాడు.
అధికారులను కలిసినా స్పందించలేదని.. దీంతో తన అమ్మ చచ్చిపోదామంటోందని..అందుకే ఇక్కడికి వచ్చానని బాధ చెప్పుకున్నాడు. కలెక్టర్ను కలిసి టిఫిన్ బండి పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని అడగాలని వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఈ ఘటన మీడియాలో హైలెట్ కాగా.. అధికారులు వెంటనే స్పందించి.. యశ్వంత్ కుటుంబం టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కేటాయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa