ఏపీలోని స్కూలు విద్యార్థులకు ముఖ్య గమనిక. రేపు అంటే గురువారం (జులై 3) రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు బంద్ పాటించనున్నాయి. ఈ మేరకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ బుధవారం కీలక ప్రకటన చేసింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్- అన్ ఎయిడెడ్ పాఠశాలల బంద్ చేపట్టనున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందుతున్నప్పటికీ కొంతమంది అధికారుల తీరు సరిగా ఉండటం లేదని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. తనిఖీలు, నోటీసులు అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. అందుకే ఒకరోజు పాఠశాలలను మూసివేసి నిరసన తెలియజేయనున్నట్లు పేర్కొన్నాయి.
ఓవైపు ధన్యవాదాలు.. మరోవైపు బంద్
మరోవైపు రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు పునరుద్ధరణను ఏపీ ప్రభుత్వం ఇటీవల 8 నుంచి 10 సంవత్సరాలకు పొడిగించింది. అలాగే ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా తల్లికి వందనం కింద సాయం అందిస్తోంది. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతూ పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా ప్రతిభా అవార్డులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారానికి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది.
కానీ.. కొంతమంది అధికారులు అతిగా స్పందిస్తున్నారని.. కమిటీలు, తనిఖీలు అంటూ పాఠశాలల్లో హడావిడి చేస్తున్నారని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఆరోపించాయి. అలాగే ఏకపక్ష వార్తలు, లేఖలు, తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా తమకు నోటీసులు ఇస్తున్నారని మండిపడుతున్నాయి. తమ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని అధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని.. వీటన్నింటి కారణంగా పాఠశాలల్లోని సిబ్బంది, విద్యార్ధులకు ఇబ్బంది కలుగుతోందని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆరోపించాయి.
ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలను జూలై 3న మూసివేయాలని నిర్ణయించినట్లు ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని.. నిబంధనలు, నియమాలను పరిశీలన చేయకుండా నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa