ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్థాన మండపం వద్ద గొడవ.. ఏం జరిగిందో చెప్పిన టీటీడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 11:42 PM

తిరుమలలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, ఫోటోస్టూడియో షాపు యజమాని తన్నుకున్నారంటూ వచ్చిన వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది. తిరుమలలో విజిలెన్స్ సిబ్బంది, ఫోటోస్టూడియో షాపు యజమాని మధ్య ఘర్షణ జరిగిందని.. ఆస్థానమండపంలో పిడిగుద్దులు గుద్దుకున్నారంటూ వార్తలు, వీడియో బయటకు వచ్చింది. మామూళ్ల విషయంలో వివాదం తలెత్తి.. ఇద్దరూ గొడవపడ్డారంటూ వీడియో బయటకు వచ్చింది. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఓ ఛానెల్‌లో ప్రసారమైన తిరుమలలో తన్నుకున్న టీటీడీ సిబ్బంది వార్తను ఖండిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఇది పూర్తిగా అవాస్తమని క్లారిటీ ఇచ్చింది. అసలేం జరిగిందనేదీ టీటీడీ ప్రకటనలో వివరించింది.


"జూన్ 29వ తేది మధ్యాహ్నం తిరుమలలోని అఖిలాండం వద్ద కొంతమంది ఫోటోగ్రాఫర్ లు లైసెన్స్ లేకుండానే అనధికారికంగా ఫోటోలు తీస్తూ శ్రీవారి భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ఆ ఫోటోగ్రాఫర్‌ను ప్రశ్నించారు. అయితే ఆలోపే ఆ ఫోటోగ్రాఫర్ తన కెమెరాను వేరే వ్యక్తికి ఇచ్చి అక్కడి నుంచి పంపించేశారు. దీంతో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ఆ కెమెరాను తిరిగి తెప్పించాలని ఫోటోగ్రాఫర్‌ను డిమాండ్ చేశారు.


అయితే కెమెరా తిరిగి తెప్పించని ఫోటోగ్రాఫర్ కోపంతో.. అసభ్యపదజాలంతో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డును దూషించారు. దీంతో ఇద్దరి మధ్య మాటా పెరిగి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఇద్దరూ ఆస్థాన మండపంలోని 96వ నంబర్ షాపు వద్ద (ఫోటోస్టూడియో) గొడవపడ్డారు. ఈ విషయం అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.


ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఫోటో స్టూడియోలో (షాప్ నెంబరు: 96 ) పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్‌ను వివరణ కోరినట్లు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ప్రవర్తించిన తీరు కూడా నియమాలకు విరుద్ధంగా ఉండడంతో అతణ్ని విధుల నుంచి తప్పించినట్లు టీటీడీ తెలిపింది. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డును తిరుమల నుంచి తిరుపతికి పంపించి వేసినట్లు క్లారిటీ ఇచ్చింది. వాస్తవాలు తెలుసుకోకుండా జరిగిన ఘటనను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదని టీటీడీ అభిప్రాయపడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa