ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుక్కపిల్ల కరిచి కబడ్డీ క్రీడాకారుడు మృతి

sports |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 11:53 PM

కుక్కపిల్ల కరిచి రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారుడు మృతిచెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మురుగు కాల్వలో చిక్కుకున్న కుక్కపిల్లను కాపాడే సమయంలో అది కరవడంతో చిన్న గాయమైంది. దాంతో 22 సంవత్సరాల బ్రిజేశ్ సోలంకి రేబిస్ వ్యాధితో చనిపోయాడు. బ్రిజేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా గోల్డ్ మెడల్ కూడా పొందాడు.


ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌శహర్‌ ప్రాంతానికి చెందిన బ్రిజేశ్ సోలంకి రాష్ట్ర స్థాయి కబడ్డీలో రాణిస్తూ ప్రో కబడ్డీ లీగ్‌లో స్థానం కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే, రెండు నెలల కిందట ఓ కుక్క పిల్ల డ్రైనేజీలో పడటంతో బ్రిజేశ్ దానిని కాపాడే ప్రయత్నం చేశాడు. డ్రైనేజీ నుంచి కుక్క పిల్లని బయటకు తీస్తున్న సమయంలో అది అది చేతిని కొరికింది. అయితే, దాన్ని బ్రిజేశ్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. వ్యాక్సిన్ కూడా చేయించుకోలేదు.


ఇటీవల కొద్ది రోజులుగా బ్రిజేశ్ ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. నీళ్లను చూస్తే చాలా భయపడిపోతున్నాడు. దాంతో కుటుంబ సభ్యులు బ్రిజేశ్‌ను వెంటనే దగ్గరలోని హాస్పిటల్స్‌తో పాటు ఢిల్లీలో కూడా చూయించారు. అయితే ఫలితం లేకుండా పోయింది. చివరగా నోయిడా ఆస్పత్రిలో చూయించడంతో బ్రిజేశ్‌కు రేబిస్ వ్యాధి సోకిందని నిర్థారించారు. వ్యాధి ముదరడంతో శనివారం రోజు మృతిచెందగా, సోమవారం అతని స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.


బ్రిజేశ్ చనిపోవడానికి ముందు రేబిస్ వ్యాధితో బాధపడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. ఆ వీడియో బ్రిజేశ్ మతి చెలించినట్లు ప్రవర్తించడంతో పాటు వింత శబ్దాలు కూడా చేశాడు. బ్రిజేశ్ మృతిచెందడంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ పరిసర ప్రాంతాల్లో చాలా మందికి రేబిస్ వ్యాక్సిన్ వేశారు.


"కుక్క పిల్ల కరిచిన సమయంలో తన మోచేతి వద్ద ఏదో నొప్పిగా అనిపించింది. అయితే అది ప్రాక్టీస్‌లో గాయంలా అనుకుని వదిలేశాడు. కనీసం వ్యాక్సిన్ కూడా చేయించుకోలేదు" అని బ్రిజేశ్ కోచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. "అంతా ఒక్కసారిగా జరిగిపోయింది. జూన్ 26న హఠాత్తుగా నీళ్లను చూసి భయపడ్డాడు. రేబిస్ వస్తే మనిషి ఎలా ప్రవర్తిస్తాడో అచ్చం అలాగే అయిపోయాడు. మేం వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్స్‌కు తీసుకెళ్లాం. ఢిల్లీకి కూడా వెళ్లాము.. కానీ నోయిడా డాక్టర్లే రేబిస్ వ్యాధి భారిన పడ్డాడని నిర్థారించారు" అంటూ బ్రిజేశ్ సోదరుడు సందీప్ కుమార్ వివరించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa