ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుసగా ఏడు టెస్టులలోనూ 50కి పైగా రన్స్,,,ఇంగ్లండ్‌పై జైస్వాల్ పరుగుల వరద

sports |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 11:52 PM

ఇంగ్లండ్‌పై టెస్టు మ్యాచ్ అంటేనే యశస్వి జైస్వాల్‌కు పూనకం వస్తుందేమో! మ్యాచ్ ఎక్కడైనా జైస్వాల్ బాదడం మాత్రం పక్కా అన్నట్టు తయారయింది. ఇప్పటి వరకు ఇంగ్లండ్‌ మీద ఆడిన ఏడు టెస్టులలోనూ యాభైకి పైగా పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. గతంలో రాహుల్ ద్రవిడ్ ఇలానే ఇంగ్లండ్‌పై వరుసగా ఏడు టెస్టులలో యాభైకి పరుగులు చేశాడు.


 హైదరాబాద్ మొదలుకొని ఎడ్జ్‌బాస్టన్ వరకు ఇంగ్లండ్‌పై ఆడిన అన్ని టెస్టులలోనూ యశస్వి జైస్వాల్ ఫిఫ్లీ ప్లస్ స్కోర్ చేశాడు. ఓవరాల్‌గా ఈ ఏడు టెస్టులలో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌ మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేసిన జైస్వాల్.. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ బాదాడు.


బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రస్తుతం టీమిండియా రెండో టెస్టు ఆడుతోంది. ఈ టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్‌కి వచ్చిన భారత్ ఆరంభంలోనే కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది. అయినా మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ మ్యాచ్‌లో 107 బంతులు ఆడిన జైస్వాల్ 13 ఫోర్లతో 87 పరుగులు చేసి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.


యశస్వి జైస్వాల్ గత ఏడు టెస్టుల స్కోర్ వివరాలను ఒకసారి చూస్తే.. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ 80, వైజాగ్‌లో 209, రాజ్‌కోట్‌లో 214 నాటౌట్, రాంచీలో 73, ధర్మశాలలో 57 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ వేదికగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో 101, ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 87 పరుగులు చేశాడు.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదటి రోజు టీమిండియా వికెట్లు పడుతున్నా నిలకడగానే ఆడుతోంది. యశస్వి జైస్వాల్‌తో పాటు కెప్టెన్ శుభమన్ గిల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. కేఎల్ రాహుల్ రెండు పరుగులకే అవుట్ కాగా, కరుణ్ నాయర్ 31 పరుగులు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి కేవలం ఒక్క పరుగుకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa