ఏపీలో ఈ రోజు ప్రైవేటు పాఠశాలలు మూతపడనున్నాయి. రాష్ట్రంలోని కొందరు అధికారుల ఏకపక్ష వైఖరికి, వేధింపులకు నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చినట్లు ఏపీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘాలు ప్రకటించాయి. తమ ఆవేదనను తెలియజేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని సంఘాలు స్పష్టం చేశాయి.విద్యాశాఖలోని కొందరు క్షేత్రస్థాయి అధికారులు వ్యవహరిస్తున్న తీరు తమను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని యాజమాన్యాలు పేర్కొన్నాయి. తమకు అగౌరవకరమైన సందేశాలు పంపడం, హెచ్చరికలు జారీ చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించాయి. నిరంతరం పాఠశాలలను తనిఖీ చేస్తూ, యాజమాన్యాల పట్ల అతిగా స్పందించడం దురదృష్టకరమని తెలిపాయి.ముఖ్యంగా విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రవేశాల విషయంలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నామని యాజమాన్యాలు వెల్లడించాయి. సరైన ధ్రువపత్రాలు లేకపోయినా విద్యార్థులను చేర్చుకోవాలని బలవంతం చేస్తున్నారని వాపోయాయి. అంతేకాకుండా పదేపదే షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డాయి. అధికారుల నుంచి ఎదురవుతున్న ఈ వేధింపులకు ప్రతిస్పందనగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలలను ఒకరోజు పాటు మూసివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు యాజమాన్యాల సంఘాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa