ట్రెండింగ్
Epaper    English    தமிழ்

.ఏపీలో త్వరలోనే రైతులకు కొత్త పాసు పుస్తకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 08:05 PM

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభవార్త వినిపించారు. ఆగస్ట్ 15న రైతులకు కొత్త పాసు పుస్తకాలు అందిస్తామని వెల్లడించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వివరాలు వెల్లడించారు. అక్టోబర్ రెండో తేదీ నాటికి ఫ్రీహోల్డ్ భూముల అంశాన్ని పరిష్కరిస్తామని మంత్రి వివరించారు.


వైసీపీ ప్రభుత్వం భూముల రీసర్వే సరైన పద్ధతిలో చేయలేదని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఫొటోల పిచ్చితో రీసర్వే చేశారని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా, ఎవరి హక్కులకు భంగం కలగకుండా భూముల రీసర్వే చేయిస్తున్నట్లు మంత్రి వివరించారు. అలాగే ఆగస్టు 15న రైతులకు కొత్త పాసు పుస్తకాలు అందిస్తామని వెల్లడించారు.


మరోవైపు రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో భూములు వివాదాల్లో ఉన్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. అలాగే రూ.10 లక్షల కంటే తక్కువ విలువైన భూమిని సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుందని వివరించారు. మరోవైపు భవిష్యత్తులో ఆధార్ లింక్, సర్వేనంబర్ లింక్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా భూసమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు.


అలాగే భూములకు సంబంధించి వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా రైతులకు సలహాలు ఇస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని భూములకు ఆధార్‌ కార్డు నంబర్, సర్వే నంబర్ల లింకేజీతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని అనగాని సత్యప్రసాద్ వివలరించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 4.63లక్షల ఫిర్యాదులు వచ్చాయని.. వీటిలో 3.99 లక్షల ఫిర్యాదులను రెవెన్యూ అధికారులు పరిష్కరించాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు.


మరోవైపు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏపీ ప్రభుత్వం అనేక పౌరసేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. సుమారుగా 500 పౌరసేవలను మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నారు. ఆగస్ట్ 15 నాటికి ఈ సంఖ్యను 703కు పెంచాలని సీఎం చంద్రబాబు ఇటీవల ఆదేశించారు. ఈ క్రమంలోనే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా భూసమస్యలకు చెక్ పెట్టే అంశాన్ని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa