దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.13,578 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో భారత దర్యాప్తు సంస్థలకు భారీ విజయం లభించింది. ఈ కేసు సూత్రధారి, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ సోదరుడు నెహాల్ మోదీని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ , సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసిన అప్పగింత అభ్యర్థన మేరకు ఈ అరెస్ట్ జరిగింది.జూలై 4న నెహాల్ మోదీని అదుపులోకి తీసుకున్నట్టు అమెరికా న్యాయశాఖ భారత అధికారులకు అధికారికంగా తెలియజేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద, అలాగే నేరపూరిత కుట్ర ఆరోపణల కింద నెహాల్ను భారత్కు అప్పగించే ప్రక్రియను ప్రారంభించినట్టు యూఎస్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 17న జరగనుంది. ఆ సమయంలో నెహాల్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, దానిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని యూఎస్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.పీఎన్బీ కుంభకోణంలో నెహాల్ మోదీ పాత్ర చాలా కీలకమని భారత దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి. నీరవ్ మోదీ అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలను డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించడంలో నెహాల్ సహాయం చేసినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. సుమారు 50 మిలియన్ డాలర్లను రెండు కంపెనీల ద్వారా అందుకుని, వాటిని మనీ లాండరింగ్కు ఉపయోగించినట్టు ఆధారాలున్నాయి. కుంభకోణం బయటపడిన తర్వాత దుబాయ్లో కీలకమైన డిజిటల్ సాక్ష్యాలైన మొబైల్ ఫోన్లు, సర్వర్ను నెహాల్ ధ్వంసం చేశాడని కూడా ఆరోపణలు ఉన్నాయి.బెల్జియం పౌరసత్వం కలిగిన నెహాల్ మోదీ, అతని సోదరుడు నీషల్పై భారత ఏజెన్సీల విజ్ఞప్తి మేరకు ఇంటర్పోల్ ఇప్పటికే రెడ్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీ యూకే జైల్లో ఉండగా, మరో నిందితుడు మెహుల్ చోక్సీ ఆంటిగ్వాలో అప్పగింత ప్రక్రియను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నెహాల్ అరెస్ట్తో ఈ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa