ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిమాచల్ ప్రదేశ్‌లో వరదలకు నీట మునిగిన బ్యాంక్

national |  Suryaa Desk  | Published : Mon, Jul 07, 2025, 07:30 PM

గత రెండు వారాలుగా కురుస్తోన్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌ అతలాకుతలమవుతోంది. హిమాచల్‌లో మెరుపు వరదల్లో ఇప్పటి వరకూ 78 మంది ప్రాణాలు కోల్పోగా.. భారీ ఆస్తినష్టం వాటిల్లింది. ఇక, మండీ జిల్లాలో ఓ బ్యాంకు కొట్టుకుపోయింది. థునాగ్ పట్టణంలోని హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు భవనం వరదల్లో మునిగిపోయింది. దీంతో అందులోని నగదు, బంగారు ఆభరణాలు గల్లంతయినట్టే కనిపిస్తోంది. ఇటీవలి వరదల ధాటికి బ్యాంకు భవనంలోని మొదటి అంతస్తు బురద, చెత్తచెదారంతో నిండిపోయింది. వరద ఉద్ధృతికి ఓకవైపు షట్టరు పూర్తిగా పైకిలేచిపోగా. మిగిలిన రెండు షట్టర్లు వంగిపోయాయి.


అయితే, బ్యాంకులో జరిగిన నష్టాన్ని ఇప్పటికీ పూర్తిగా అంచనా వేయలేకపోతున్నారు. కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో లక్షల విలువ చేసే ఆభరణాలూ ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాలు, బురదను పూర్తిగా తొలిగించిన తరువాతే నష్టం ఏమేరకు ఉంటుందో గుర్తించగలుగుతారు. థునాగ్ మార్కెట్ మధ్యలో ఉన్న ఈ బ్యాంకులో సుమారు 150 మంది వ్యాపారులకు ఖాతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో జనాభా 8,000 పైగా ఉండగా, ప్రజలందరికీ ఇదే ప్రధాన బ్యాంకు.


‘‘ఇది చాలా పాత బ్యాంకు. ప్రతి రోజూ ఎన్నో లావాదేవీలు జరిగేవి. ఇప్పుడు అయితే నగదు, పత్రాలు, లాకర్లన్నీ రాళ్లుగానూ, మట్టిగానూ మారిపోయాయి’‘ అని హరి మోహన్ అనే స్థానిక వ్యాపారి వాపోయారు. వరదల్లో కొట్టుకుపోయిన విలువైన


వస్తువులు చోరీకి గురయ్యే ప్రమాదం ఉండటంతో, కొంతమంది స్థానికులు బ్యాంకు వద్ద రాత్రింబవళ్లూ కాపలాగా ఉన్నారు. ఇక, జూన్ 26న కులు జిల్లాలో క్లౌడ్‌బరస్ట్ కారణంగా మెరుపు వరదలు సంభవించి.. మంత్రులు, అధికారులు చిక్కుకున్న విషయం తెలిసిందే.


జూన్ 20 నుంచి జులై 6 మధ్య హిమాచల్ ప్రదేశ్‌లో 23 మెరుపు వరదలు , 19 క్లౌడ్ బరస్ట్‌లు, 16 కొండచరియల ఘటనలు సంభవించాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 78 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 50 మంది వర్షాల వల్ల మరణించగా, 28 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. ఇంకా 37 మంది కనిపించకుండా పోయారు, 115 మంది గాయపడ్డారు.


మనాలి, హిమాచల్ ప్రదేశ్


అయితే, బంగాళాఖాతంలో అల్పపీడనానికి తోడు.. రుతుపవనాలు చురుకుగా మారడంతో భారీ వర్షాల ముప్పు ఇంకా కొనసాగుతోంది. జులై 7న ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. జులై 8, 9 తేదీల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సిర్మౌర్, కాంగ్రా, మండీ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, షిమ్లా, సోలన్, హమీర్పూర్, బిలాస్పూర్, ఊనా, కుల్లు, చంబా వంటి ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa