ప్రముఖ పారిశ్రామికవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య బిహార్లో సంచలనంగా మారింది. జులై 4న ఆయన నివాసం వద్దే గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఖేమ్కా మృతిచెందారు. ఈ కేసులో కీలక అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య తర్వాత అంత్యక్రియలకు హాజరైన అనుమానితుడు అడ్డంగా దొరికిపోయాడు. ఆదివారం (జులై 6న) పట్నాలోని గుల్బీ ఘాట్ వద్ద ఖేమ్కా అంత్యక్రియలు నిర్వహించారు. ఇందులో ఖేమ్కా బంధువులు, కుటుంబసభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. వారితో పాటు హత్యకు పాల్పడిన నిందితుడు కూడా వచ్చాడు. తనపై ఎవరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశంతో ఏమీ తెలియనట్టు పూలదండ పట్టుకొచ్చాడు. కానీ, సీసీటీవీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. పట్నాలోని పున్పున్ ప్రాంతానికి చెందిన రోషన్ కుమార్గా గుర్తించారు. హత్యలో అతడి పాత్రపై ప్రశ్నిస్తున్న పోలీసులు.. కీలక సమాచారం రాబట్టినట్టు సమాచారం. కాల్పులకు ముందు తామంతా ఓ టీ స్టాల్ వద్ద కూర్చున్నట్టు రోషన్ తెలిపాడు.
అలాగే, ఈ కేసుకు సంబంధించి పోలీసులు జైలులో కూడా సోదాలు నిర్వహించి అనుమానితులు వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపిన పోలీసులు.. అందులో కుట్రకు సంబంధించిన సమాచారం లభించే అవకాశముందని భావిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జూన్ 4 రాత్రి బంకీపూర్ క్లబ్ నుంచి ఖేమ్కా బయలుదేరిన తర్వాత కదలికలపై అక్కడ నిఘా పెట్టిన వ్యక్తి కిల్లర్కు సమాచారం అందించాడు. తర్వాత రెండో స్పాటర్ బిస్కోమాన్ టవర్ వద్ద ఉన్నట్లు గుర్తించాడు. అప్పటికే ఖేమ్కా ఇంటి వద్ద షూటర్ ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.
బంకీపూర్ క్లబ్, గాంధీ మైదాన్, బుద్ధ కాలనీ, ఇన్కమ్ టాక్స్ గోలంబర్ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. రాత్రి 11:40 గంటల సమయంలో ఖేమ్కా తన కారు నుంచి బయటకు వస్తుండగా దుండగుడు కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం. హత్య ముందస్తు పథకంలో భాగంగా జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు దాదాపు డజను మందిని విచారిస్తున్నారు.
ఈ ఘటనపై బీహార్ వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో చాలా మందికి గోపాల్ ఖేమ్కాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వ్యాపారుల భద్రతపై సందేహాలు తలెత్తిన నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం స్పందించింది. వ్యాపార వర్గానికి తగిన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఈ హత్యోదంతంపై బిహార్లో రాజకీయ దుమారం రేగుతోంది. నితీశ్ కుమార్ సర్కారుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. నీతీశ్ పాలనలో బిహార్ నేర రాజధానిగా మారిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాష్ట్రంలో వ్యాపారవేత్తలు, ప్రజలకు భద్రత లేకుండా పోతుందని.. హత్యలు, దోపిడీలు సర్వసాధారణంగా మారాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ధ్వజమెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa