బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - SIR) ప్రక్రియపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఈ ప్రక్షాళన ప్రక్రియ సమయం, దాని అమలు తీరుపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. అగమేఘాల మీద ఈసీ చేయాలనుకుంటున్న ఈ తొలగింపుల వల్ల వేలాది మంది.. ముఖ్యంగా పేదలు, సరైన పత్రాలు లేని వలస కార్మికులు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఒవైసీ హెచ్చరించారు. ఓటు హక్కు మాత్రమే కాకుండా వారి పౌరసత్వం కూడా గల్లంతు అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన ఆందోళనను స్పష్టం చేస్తూ.. కొందరు వ్యక్తులు నిజంగా అక్రమ వలసదారులే అయితే వారికి 2024 లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. ఈ ప్రక్రియ వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ల హస్తం ఉందని అన్నారు. ముఖ్యంగా ఈ రెండు పార్టీలే బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారుల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ కుట్రపూరిత చర్యల ద్వారా ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన ఓటర్లను జాబితా నుండి తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఓవైసీ అభిప్రాయపడ్డారు.
ఈ మొత్తం ప్రక్రియను నిలిపివేయాలని లేదా గడువును పొడిగించాలని ఏఐఎంఐఎం ఈసీఐని కోరింది. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం అనేది కేవలం ఓటు హక్కును మాత్రమే కాకుండా, వారి జీవనోపాధిని, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులు కూడా కాకుండా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఒవైసీ నొక్కి చెప్పారు. చాలా మంది వలస కార్మికులు తాత్కాలిక నివాసాలలో నివసిస్తున్నారని.. వారికి శాశ్వత చిరునామా పత్రాలు ఉండవని చెప్పారు. అలాంటి వారిని జాబితా నుంచి తొలగించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. సవరించే ఓటర్ జాబితాలో 15 నుంచి 20 శాతం మంది పేర్లు గల్లంతు అయినా వారు కేవలం తమ ఓటు హక్కును మాత్రమే కోల్పోరని.. తమ పౌరసత్వాన్ని కూడా కోల్పోతారని స్పష్టం చేశారు.
ఈసీఐ పారదర్శకను పాటించి ఈ సవరించే ప్రక్రియను రద్దు చేయాలని కోరారు. అలాగే ఏ ఒక్క సామాన్య పౌరుడికీ అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. బీహార్లోని రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంస్థలు కూడా ఈ ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్నాయి. రాబోయే ఎన్నికలలో ఈ ఓటర్ల తొలగింపు అంశం ఒక ప్రధాన రాజకీయ చర్చగా మారే అవకాశం ఉంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడం అత్యంత ముఖ్యమని ఓవైసీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa