ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పైలట్లందరికీ మళ్లీ వైద్య పరీక్షలు.. భయంలో విమానయాన సంస్థలు

national |  Suryaa Desk  | Published : Mon, Jul 07, 2025, 07:56 PM

దేశంలో వాణిజ్య పైలట్ల వైద్య పరీక్షల విషయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక కీలకమైన కొత్త నిబంధనను ప్రవేశ పెట్టింది. ఇకపై పైలట్లు తప్పనిసరిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) కేంద్రాలలో మాత్రమే తమ వైద్య పరీక్షలను చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్పు విమానయాన సంస్థలతో పాటు పైలెట్లలోనూ తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. అందుకు గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


గతంలో పైలట్లు తమ వైద్య పరీక్షలను డీజీసీఏ ఆమోదించిన ప్రైవేట్ ఆసుపత్రులు లేదా డీజీసీఏ ఎంప్యానెల్ చేసిన వైద్య పరీక్షకుల వద్ద చేయించుకోవడానికి అనుమతి ఉండేది. అయితే ఇటీవలే ఓ విమాన సంస్థకు చెందిన కో-పైలట్ విధుల్లో ఉండగానే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. తదనంతర దర్యాప్తులో ఆ పైలట్‌కు గతంలోనే తెలియని గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త నిబంధనను తీసుకు వచ్చింది. కొందరు పైలెట్లు తమ వైద్య రికార్డులను తప్పుగా చూపిస్తూ.. పరీక్షల్లో ఉత్తీర్ణులవుతున్నారనే అనుమానం కారణంగానే ఈ నిబంధనను ప్రవేశ పెట్టినట్లు ఒక సీనియర్ రెగ్యులేటరీ అధికారి తెలిపారు.


  ఈ కొత్త ఆదేశంపై విమానయాన సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఐఏఎఫ్ కేంద్రాలు మిలటరీ ప్రమాణాలకు అనుగుణంగా చాలా కఠినమైన వైద్య నిబంధనలను పాటిస్తాయి. ఈ కఠినమైన ప్రమాణాల కారణంగా పెద్ద సంఖ్యలో పైలట్లు విధులకు అనర్హులుగా మారే అవకాశం ఉందని, ఇది పైలట్ల కొరతకు దారి తీస్తుందని విమానయాన సంస్థలు భయపడుతున్నాయి. దీనివల్ల బీమా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.


అంతేకాకుండా ఐఏఎఫ్ కేంద్రాల సామర్థ్యం పరిమితంగా ఉండటం వల్ల వైద్య పరీక్షల ప్రక్రియలో సుదీర్ఘ జాప్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇది పైలట్ల లభ్యతను ప్రభావితం చేసి, విమాన కార్యకలాపాలకు ఆటంకం కలిగించవచ్చని విమానయాన సంస్థలు భావిస్తున్నాయి. మరోవైపు పైలెట్లు సైతం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమకు ఉన్న చిన్న చిన్న సమస్యల వల్ల కూడా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుందేమోనని అనుకుంటున్నారు.


అయితే తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ కూడా ఈ విషయంపై స్పందించింది. సైనిక వైద్యులు వాణిజ్య పైలట్లను యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఫైటర్ పైలట్ల మాదిరిగానే కఠినమైన ప్రమాణాలతో అంచనా వేస్తున్నారని.. ఇది అనవసరమైన, ఖరీదైన ద్వితీయ పరీక్షలకు దారితీస్తుందని పేర్కొంది. ఈ పరిణామం భారతీయ విమానయాన రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa