ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారే నిజమైన దేశభక్తులు: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 11, 2025, 08:35 PM

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పెరుగుదల తగ్గడం గురించి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ జనాభా గురించి పలు సందర్భాలలో ప్రస్తావిస్తూ వస్తున్న చంద్రబాబు.. తాజాగా ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తానే జనాభా నియంత్రణ గురించి మాట్లాడానన్న చంద్రబాబు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని అన్నారు. జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. "ఒకరు ఉంటే ముద్దు, ఇద్దరు ఉంటే ఫర్వాలేదు.. ముగ్గురు వద్దు గతంలో చెప్పా. ఇప్పుడేమంటున్నానంటే ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉంటే పిల్లలు ఉన్నవారే నిజమైన దేశభక్తులు. సమాజాన్ని కాపాడే వ్యక్తులు. అలాంటి వారిని గౌరవిద్దాం." అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.


మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు జనాభా అనేది ఆస్తిగా మారిపోయిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు అధిక జనాభా ఉన్న దేశాలను చులకనగా చూసే పరిస్థితి ఉండేదని.. కానీ ఇప్పుడు జనాభా భారం కాదు ఆస్తి అని చంద్రబాబు అన్నారు. గురజాడ చెప్పిన విధంగా దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే స్ఫూర్తితో ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని గతంలో చట్టం తెచ్చామని.. కానీ ఇప్పుడు ఆ చట్టాన్ని కూడా మార్పులు చేసినట్లు గుర్తు చేశారు. ఏపీలో ప్రత్యుత్పత్తి రేటు 1.8గా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు.. ప్రత్యుత్పత్తి రేటు 2.1గా ఉంటేనే జనాభా పెరుగుదల స్థిరంగా ఉంటుందన్నారు.


మరోవైపు జనాభా పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. పిల్లలను కనేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ జనాభా 2026 నాటికి 5.38 కోట్లకు, అలాగే 2051 నాటికి 5.41 కోట్లకు చేరుకుంటుందని అంచనా. జనాభా పెరుగుదల లేకపోతే యువత తగ్గిపోతారని.. వృద్ధుల సంఖ్య పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదనలు కూడా ఉన్నాయి. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని పిల్లలను కనాలని చంద్రబాబు దంపతులకు సూచిస్తున్నారు. ఇందుకోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa