పెళ్లి విందులో చికెన్ ముక్క కోసం స్నేహితుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ.. చివరకు హత్యకు దారితీసింది. విస్మయానికి గురిచేసే ఈ ఘటన కర్ణాటకలోని బెళగావిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెళగావి జిల్లా యరగట్టి తాలూకాకు చెందిన అభిషేక్ కొప్పాడ్ అనే యువకుడికి కొద్ది రోజుల కిందట వివాహం జరిగింది. ఈ క్రమంలో అభిషేక్ తన ఫామ్లో ఆదివారం రాత్రి స్నేహితులకు విందు ఏర్పాటు చేశాడు. ఈ విందుకు అతడి స్నేహితుడు వినోద్ హాజరయ్యాడు. విట్టల్ అనే వ్యక్తి వడ్డిస్తుండగా.. తనకు చికెన్ తక్కువైందని ‘ఇంకొక ముక్క వేయమని’ వినోద్ అడిగాడు. దీంతో విట్టల్, తోటి అతిథుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదం చినికిచినికి గాలివానై పెద్ద గొడవకు దారితీసింది.
ఘర్షణ పెరగడంతో చివరకు కోపంతో ఊగిపోయిన విట్టల్, పక్కనే ఉన్న ఉల్లిపాయులు కోసే కత్తి తీసుకుని వినోద్పై దాడి చేసి, విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వినోద్.. రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విట్ల్ను అరెస్ట్ చేశారు. ఈ హత్యకు గల పూర్తి కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. పెళ్లి రిసెప్షన్లో మాంసం సరిగ్గా వడ్డించలేదని వధువు మేనమామను హత్యచేసిన ఘటన ఏపీలో జరిగింది.
కాగా, గతనెలలో మహారాష్ట్రలోని వసాయ్ ప్రాంతంలో ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓ పుట్టినరోజు వేడుకలో మొదలైన చిన్నపాటి వాగ్వాదం 20 ఏళ్ల యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వసాయ్ వెస్ట్లోని పాప్డి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలో ఇది చోటుచేసుకుంది. బాధితులు, నిందితులు ఒకే పరిశ్రమలో పనిచేస్తున్నవారే. జులై 7న ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా వీరంతా ఓ చోటచేరి స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నారు. కొద్ది సమయం తర్వాత ఇద్దరు యువకుల మధ్య మొదలైన వాగ్వాదం పెరిగి తీవ్రంగా మారింది. కొందరు మద్యం మత్తులో ఉండటం వల్ల పరిస్థితి అదుపు తప్పింది. దీంతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఇందులో ఒక 20 ఏళ్ల యువకుడు తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడగా, వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెళ్లిలో అప్పడం కోసం మొదలైన గొడవ రణరంగంగా మారిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఈ ఘటన కూడా బెళగావిలో చికెన్ ముక్క కోసం హత్య జరిగిన ఘటనను తలపించింది. చిన్నపాటి వాగ్వాదాలు, మద్యం మత్తు, హింసాత్మక ప్రవర్తన, క్షణికావేశం వెరసి ఎన్నో విలువైన ప్రాణాలు కోల్పోతున్న దురదృష్టకర పరిస్థితిని దారితీసుతన్నాయి. స్నేహితుల మధ్య జరగాల్సిన ఆనంద వేడుకలు, ఆకస్మికంగా హింసాత్మకంగా మారిపోతుండటమే ఈ తరం ఆందోళనకర మానసిక స్థితిని సూచిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa