జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన AI171 విమాన ప్రమాదంపై విచారణ కొనసాగుతుండగా.. ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమాదానికి మెకానికల్ లేదా నిర్వహణలోపం కారణం కాదని వ్యాఖ్యానించారు. ఎయిర్క్రాఫ్ట్స్ ప్రమాదాల దర్యాప్తు విభాగం (AAIB) రెండు రోజుల కింద విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో విమానం లేదా దాని ఇంజిన్లలో ఎలాంటి మెకానికల్ సమస్యలు లేదా నిర్వహణ లోపాలు లేవని పేర్కొంది. విమానంలో వాడిన ఇంధనంలో కూడా ఎలాంటి లోపం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, టేకాఫ్ సమయంలో ఎలాంటి అసాధారణతలు నమోదుకాలేదని నివేదిక వెల్లడించింది.
విమానం నడిపిన ఇద్దరు పైలట్లకు నిర్వహించిన ఆల్కహాల్ పరీక్షలో నెగెటివ్ వచ్చిందని, వారి వైద్య స్థితిలో ఎలాంటి అనుమానించదగి అంశాలు లేవని విల్సన్ తెలిపారు. AAIB నివేదికలో విమానంలో ఫ్యూయల్ స్విచ్ఛాఫ్ చేసి.. ఇంజిన్లను మళ్లీ ఆన్ చేయడానికి ప్రయత్నించారని పేర్కొంది. అయితే, కుట్రకోణం, పక్షి ఢీకొట్టడం వంటి కారణాలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. ఎయిరిండియా ప్రమాద కారణాలను తెలిపే బ్లాక్ బాక్స్ విశ్లేషణ ఇంకా కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
జూన్ 12న మధ్యాహ్నం 1.30 గంటలకు గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్లోని గాట్విక్కు 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సహా మొత్తం 242 మంది ఎయిరిండియా విమానం ఏఐ171 బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే జీబీ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఒక్కడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. దానిలో 241 మందితో పాటు విమానం కూలిన మెడికల్ కాలేజీ హాస్టల్లోని 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దశాబ్ద కాలంలో ప్రపంచంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. పైలట్లు కావాలనే స్విచ్ఛాఫ్ చేశారని వైమానిక దళ నిపుణుడు ఆరోపించిన విషయం తెలిసిందే.
ఉద్యోగులకు లేఖ రాసిన ఎయిర్ ఇండియా సీఈఓ విల్సన్.. మీడియాలో ఊహాగానాలను, తప్పుడు ప్రచారాలను పట్టించుకోవద్దని సూచించారు. ‘‘ప్రాథమిక నివేదిక ఇంకా పూర్తి నివేదిక కాదు. విచారణ కొనసాగుతోంది. ఎలాంటి ముందస్తు నిర్ణయాలు తీసుకోకండి’’ అని ఆయన హెచ్చరించారు. విచారణ పూర్తయ్యేంతవరకు గత మూడేళ్లుగా ఎయిరిండియా ప్రయాణానికి శక్తినిచ్చిన నైతిక విలువలు, కస్టమర్ ఫోకస్, టీమ్ వర్క్ను కొనసాగించాలని విల్సన్ సూచించారు. ఎయిరిండియా వినియోగించే ప్రతి Boeing 787 విమానం పూర్తి పరీక్షల తర్వాత సర్వీసుకు అనుకూలంగా ఉన్నాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటనపై మరింత స్పష్టత తుది నివేదికలోనే లభించనుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా విచారణ పూర్తయ్యేంతవరకు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa