జూన్ 12వ తేదీన అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో మొత్తంగా 274 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇటీవలే ఈ దుర్ఘటనపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక వెల్లడి అయింది. అందులోనే ఇంధన స్విచ్ల వైఫల్యం వల్లే ఇంజిన్లకు ఇంధనం సరఫరా నిలిచిపోయిందని తేలింది. దీంతో బోయింగ్ విమానాల్లో ఇంధన సరఫరా స్విచ్లపై చర్యలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే కొన్ని విమానయాన సంస్థలు.. తమ పైలెట్లకు పలు సూచనలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎతిహాద్ ఎయిర్వేస్ సంస్థ.. తమ పైలెట్లకు బోయింగ్ 787 విమానాల్లోని ఇంధన స్విచ్ల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది.
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక.. సంచలన విషయాన్ని వెల్లడించింది. ప్రమాదానికి గురైన ఆ విమానంలోని రెండు ఇంధన స్విచ్లూ టేకాఫ్ అయిన కొద్ది సేపటికే 'రన్' (నడుస్తున్న) స్థితి నుండి 'కటాఫ్' (ఆఫ్) స్థానాలకు మారినట్లు నివేదికలో పేర్కొన్నారు. స్విచ్ల పని తీరులో వచ్చిన సమస్యే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా అనుమానిస్తున్నాయి. దీనిపై ఒక్కొక్కరూ ఒక్కో రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పైలెట్లే కావాలని స్విచ్లు ఆఫ్ చేసుంటారని కొందరు, పైలెట్ల ప్రమేయం లేకుండానే స్విచ్లు ఆగినట్లు మరికొందరు వివరిస్తున్నారు.
ఇలా ఎయిర్ ఇండియా ప్రమాద దర్యాప్తు నివేదికలోని ఈ కీలక అన్వేషణల నేపథ్యంలోనే ఎతిహాద్ ఎయిర్వేస్ అప్రమత్తమైంది. బోయింగ్ 787 విమానాలు వారి వద్ద కూడా ఉండగా.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడమే లక్ష్యంగా పైలెట్లకు పలు సూచనలు చేసింది. ఇంధన స్విచ్లను జాగ్రత్తగా నిర్వహించడం ఎంత ముఖ్యమో తమ పైలట్లకు వివరించింది. అలాగే ఆ స్విచ్లలో ఏదైనా సాంకేతిక లోపాలు ఉన్నాయా లేదా అని పరిశోధించడానికి దర్యాప్తును కూడా ప్రారంభించింది.
ప్రమాదాల నుంచి నేర్చుకొని భవిష్యత్తులో వాటిని నివారించడానికి విమానయాన సంస్థలు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఎతిహాద్ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఒక చిన్న సాంకేతిక లోపం లేదా మానవ తప్పిదం కూడా భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించవచ్చని ఈ సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. ఎతిహాద్ తీసుకున్న ఈ చర్య బోయింగ్ 787 విమానాల భద్రతా ప్రోటోకాల్లను మరింత పటిష్టం చేయడానికి, పైలెట్లకు మరింత స్పష్టమైన మార్గదర్శకాలను అందించడానికి సహాయపడుతుంది. ఇది ప్రపంచ విమానయాన పరిశ్రమలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుందనే విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa