128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లోకి క్రికెట్ అడుగుపెట్టనుంది. ఈ మేరకు వచ్చే 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లో క్రికెట్ సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. మ్యాచ్ల ప్రారంభానికి మూడేళ్ల ముందుగానే షెడ్యూల్ ప్రకటించడం గమనార్హం. 2028 ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ ఎంజెలెస్లో జరగనుంది. ఇందులో క్రికెట్ పోటీలు.. 2028 జులై 12 నుంచి అంటే.. ఒలింపిక్స్ ప్రారంభానికి రెండు రోజుల ముందు నుంచి ప్రారంభం కానున్నాయి. పోటీలు జులై 29న ముగియనున్నాయి.
ఇక ఈ ఒలింపిక్స్లోని అన్ని మ్యాచ్లూ కూడా లాస్ ఏంజెలెస్కు 50 కిమీ దూరంలో ఉన్న పమోనాలోని ఫెయిర్ప్లెక్స్లో ప్రత్యేకంగా నిర్మిస్తున్న 500 ఎకరాల తాత్కాలిక స్టేడియంలో జరుగుతాయి. ఈ ఒలింపిక్స్లో క్రికెట్ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం ఆరు అంతర్జాతీయ జట్లు ఒలింపిక్స్లో పోటీ పడతాయి. స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం ఆరు జట్లు పోటీ పడనున్నాయి. అయితే ఈ జట్లను ఏ ప్రాతిపదికన తీసుకుంటారు? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
ఆరు జట్లు పాల్గొనే ఈ టోర్నీలో ఒక జట్టు మిగిలిన ఐదు జట్లతో రౌండ్ రాబిన్ తరహాలో ఒక్కో మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. రోజుకు రెండు మ్యాచ్లు జరిగేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. రెండు పతకాల మ్యాచ్లు ప్రత్యేక రోజుల్లో జరగనున్నాయి. గ్రూప్ స్టేజ్ క్రికెట్ మ్యాచ్లు జులై 12 నుంచి 18, జులై 22 నుంచి 28 వరకు రెండు సెగ్మెంట్లలో జరగనున్నాయి. జూలై 14, జూలై 28న ఎలాంటి క్రికెట్ మ్యాచ్లు జరగవు. మెడల్స్ మ్యాచ్లు జులై 19 (మహిళలు), 29 (పురుషులు) తేదీల్లో జరుగుతాయి.
భారత కాలమానం ప్రకారం మ్యాచ్లు రాత్రి 9:30 గంటలకు, ఉదయం 7 గంటలకు మొదలవుతాయి. ఒక్కో జట్టులో 15 మందితో కూడిన సభ్యులకు స్థానం కల్పించనున్నారు. ఇలా మొత్తంగా మహిళలు, పురుషుల జట్లలో కలిపి 180 మందికి అథ్లెట్లు పాల్గొంటారు. ఒలింపిక్స్లో క్రికెట్ పోటీలు టీ20 ఫార్మాట్లో జరగనుండగా.. ఇప్పటికే పొట్టి క్రికెట్కు గుడ్బై చెప్పిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఒలింపిక్స్లో పాల్గొనలేరు. ఇక.. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లో క్రికెట్తో పాటు బేస్బాల్/సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోస్ (సిక్సస్), స్క్వాష్ పోటీలను కొత్తంగా చేర్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa