విద్యుత్ సంస్కరణలు మొట్టమొదట ప్రారంభించింది తానేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సీటీలో నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎనర్జీ కంపెనీల ఎండీ, సీఈఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు గ్రీన్ హైడ్రోజన్పై సంస్థలు పరిశోధనలు చేయాలని సూచించారు.
గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్కు పెరిగిన ప్రాధాన్యతను గుర్తు చేసిన సీఎం, విద్యుత్ తయారీ సంస్థలతో దానిపై మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 199లో మొట్టమొదటిసారి విద్యుత్ సంస్కరణలు ప్రారంభించింది తానేనని చెప్పారు. సంస్కరణలు అమలు చేసిన కారణంగానే అప్పట్లో అధికారం కూడా కోల్పోయానన్నారు. కేంద్రం గ్రీన్ హైడ్రోజన్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని.. ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాంటి పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్ర బిందువు కావాలని ఆయన ఆకాంక్షించారు.
భవిష్యత్లో ఏపీ హైడ్రోజన్ వ్యాలీగా మారనుందని.. గ్రీన్ హైడ్రోజన్ తయారీ, రవాణాకు అవసరమైన సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తక్కువ ఖర్చుతో విద్యుత్ తయారీ, స్టోరేజీపై దృష్టి సారించాలని సూచించారు. ఇంధన రంగంలో సమూల మార్పులు రావాలని చంద్రబాబు బలంగా కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో కరెంట్ కూడా సరిగా ఉండేది కాదని.. 1995లో శ్రీశైలం రివర్స్ పంప్ విధానం ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఏ రాష్ట్రానికి లేని వనరులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయని.. అదే అత్యధిక విద్యుత్ డిమాండ్ను అధిగమించేందుకు ఉపయోగపడిందన్నారు.
విశాఖలో కేంద్రం, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ తయారీ దిశగా చర్యలు చేపట్టాయని వివరించారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్తో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఇవ్వడం సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండాలనే లక్ష్యంగా ప్రస్తుతం పని చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ మాట్లాడుతూ గ్రీన్ హైడ్రోజన్ ఆలోచన ఏడేళ్ల కిందట మొదలైందన్నారు. 2047 సంవత్సరాని కల్లా వంద గిగావాట్ల అణు విద్యుత్ తయారీని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa