ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బావతో వివాహేతర సంబంధం.. భర్తకు 15 నిద్రమాత్రలిచ్చి హత్యాయత్నం

Crime |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 08:46 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించి.. కట్టుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. ముఖ్యంగా ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి మరీ.. భర్త తినే ఆహారంలో 15 నిద్ర మాత్రలు కలిపింది. అతడు భోజనం చేసి పడుకున్న తర్వాత నుంచి ఎప్పుడెప్పుడు చనిపోతాడా అని కళ్లల్లో వత్తులేసుకుని కూర్చుంది. ఎంతకూ శ్వాస ఆగిపోవడం లేదని గుర్తించి ప్రియుడికి మెసేజ్ పెట్టింది. కాసేపు చూడమని చెప్పగా అలాగే చేసింది. అయినా చనిపోకపోవడంతో.. మళ్లీ ప్రియుడికి చెప్పగా కరెంట్ షాక్ పెట్టి చంపేయాలని చెప్పాడు. దీంతో ఆమె అలాగే చేసింది. భర్తను చంపి ఆపై ఆస్పత్రికి తీసుకెళ్లింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు ఎలా వెలుగులోకి వచ్చిందంటే..?


వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన సుష్మితకు కరణ్ దేవ్‌కు చాలా రోజుల క్రితమే వివాహం జరిగింది. అయితే ఇంతకాలం వీరిద్దరి మధ్య కాపురం బాగానే సాగగా.. సుష్మితకు ఇటీవలే తన భర్త సోదరుడు రాహుల్‌తో వివాహేతర సంబంధం ఏర్పిడంది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. కలిసే జీవించాలని నిర్ణయించుకున్నారు. అలా అయితేనే నచ్చినప్పుడల్లా కలవొచ్చని.. చాటుమాటుగా వ్యవహారం సాగించలేమని మాట్లాడుకున్నారు. అయితే ఇదంతా జరగాలంటే తన భర్త తనను వదిలేయాలని.. కానీ అలా చేస్తే పరువు పోతుంది కాబట్టి చంపేయాలని నిర్ణయించుకున్నారు.


ఈ క్రమంలోనే కరణ్‌ను హత్య చేయడానికి ఒక క్రూరమైన పథకాన్ని రచించారు. పథకంలో భాగంగా.. సుష్మిత కరణ్ తినే భోజనంలో ఏకంగా 15 నిద్ర మాత్రలను కలిపింది. భారీ మోతాదులో మత్తు మందు తీసుకున్న కరణ్ అన్నం తిన్న వెంటనే స్పృహ కోల్పోయాడు. ఇలా అతడిని బెడ్డుపై పడుకోబెట్టింది. స్పృహ అయితే కోల్పోయాడు కానీ.. అతడింకా శ్వాస తీసుకుంటుండంతో.. చనిపోలేడని నిర్ధారణకు వచ్చింది భార్య సుష్మిత. ఇదే విషయాన్ని తన బావ, ప్రియుడు అయిన రాహుల్‌కు చెప్పింది. కాసేపైతే చస్తాడులే.. వేచి చూడమని చెప్పాడు. ఆమె కూడా అలాగే చేసింది. కానీ గంటయ్యాక కూడా అతడు శ్వాస తీసుకుంటుండంతో కరెంట్ షాక్ పెట్టి చంపేయమని వివరించాడు.


రాహుల్ సూచన మేరకు సుష్మిత.. భర్తకు విద్యుత్ షాక్ ఇవ్వడానికి ప్రయత్నించింది. అప్పుడే అతడు శ్వాస తీసుకోవడం ఆపేశాడు. దీంతో కరణ్‌కు విద్యుత్ షాక్ తగిలి స్పృహ కోల్పోయాడని కుటుంబ సభ్యులను నమ్మించి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సరికే కరణ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కరణ్ మృతిపై మొదట అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదు. కానీ పోలీసులు మాత్రం ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే కరణ్ మృతదేహానికి పోస్టుమార్టం చేస్తామని చెబితే.. సుష్మిత, రాహుల్‌లు ఒప్పుకోలేదు. అలాగే పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు.


దీంతో పోలీసులకు మరింత అనుమానం ఎక్కువ కాగా.. పోస్టుమార్టం నిర్వహించారు. ఈక్రమంలోనే అతడు నిద్ర మాత్రల వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలుసుకుని.. భార్య సుష్మితను అదుపులోకి తీసుకుని విచారించారు. ముందుగా నిజం చెప్పకపోయినా ఆ తర్వాత నేరాన్ని ఒప్పుకుంది. ప్రియుడు రాహుల్ కోసమే తాను ఇదంతా చేసినట్లు వివరించింది. దీంతో వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు కరణ్ కుటుంబ సభ్యులు.. సుష్మే హత్య చేసిందని తెలుసుకుని హతాశులయ్యారు. ఆమెకు ఎలాగైనా కఠిన శిక్ష పడేలా చేయాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa