రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ పంటలు ఊపిరి పోసుకుంటున్నాయి. నైరుతి రుతుపవనాలు వచ్చాక.. జూన్లో తొలకరి వర్షాలకు చాలా మంది రైతులు విత్తనాలు నాటారు. ఇప్పటి వరకు 10లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగులోకి వచ్చాయి. కానీ మొన్నటి దాకా రుతుపవనాలు మందగించడంతో మెట్ట పంటలకు నీటి తడులు అందక పైర్లు ఎండుముఖం పట్టి రైతులు సతమతమవుతున్నారు. ఈ తరుణంలో ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రుతుపవనాల్లో కదలిక వచ్చి.. గత నాలుగైదు రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు పడుతున్నాయి. దీంతో పైర్లన్నీ జీవం పోసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా పత్తి, వేరుశనగ, కంది, మినుము, పెసర, చిరుధాన్యాల పంటలకు ఈ వర్షాలు మేలు చేస్తాయని రైతులు చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత వర్షాలు పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో సాగు చేయాల్సిన మిగిలిన విస్తీర్ణంలో పంటలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసి, రాష్ట్రంలోని జలాశయాలకు నీరు చేరడంతో కృష్ణా, గోదావరి డెల్టాలోని ఆయకట్టుకు ఇరిగేషన్శాఖ కాలువల ద్వారా నీరు విడుదల చేసింది. దీంతో వరి సాగు ముమ్మరంగా జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa