ట్రెండింగ్
Epaper    English    தமிழ்

100% టారిఫ్‌లు విధిస్తాం.. భారత్‌, చైనాలకు అమెరికా సెనేటర్ వార్నింగ్

international |  Suryaa Desk  | Published : Tue, Jul 22, 2025, 10:57 PM

‘‘రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే మీ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తాం’’ అని భారత్‌ను అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహామ్ హెచ్చరించారు ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, చైనా, బ్రెజిల్‌లపై 100 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తోన్న రష్యా... కాల్పుల విరమణ ఒప్పందానికి నిరాకరించడంతో డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్ కూడా రష్యా భాగస్వామ్య దేశాలపై భారీగా సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో అమెరికా సెనేటర్ గ్రాహామ్ బెదిరింపులకు దిగారు.


‘‘రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలైన చైనా, భారత్, బ్రెజిల్‌లపై ట్రంప్ 100 శాతం టారిఫ్‌లు వేస్తారు. మీరు చౌకగా రష్యా చమురు కొనుగోలు చేస్తూనే ఉంటే, మేము మీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాం’ అని గ్రాహామ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మూడు దేశాలే దేశాలే రష్యా చమురు ఎగుమతులలో 80 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయని అమెరికా సెనేటర్ ఆరోపించారు. ‘‘మీరు చౌకగా చమురు కొనుగోలు చేసి పుతిన్‌కు యుద్ధాన్ని నడిపించే ధనాన్ని అందిస్తున్నారు.. ఇది బ్లడ్ మనీ’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో రహస్య సంభాషణ జరిపిన ట్రంప్.. మాస్కోపై దాడిచేయగలవా? అని అడిగినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది.


 ‘‘చైనా, భారత్, బ్రెజిల్ మీరు అమెరికా ఆర్థిక వ్యవస్థను ఎంచుకోవాలా, లేదా పుతిన్‌కు మద్దతివ్వాలా అన్న ఆప్షన్ మీ ముందు ఉంది. ట్రంప్ సుంకాలతో మీరు తప్పక అమెరికా వైపే రావాల్సి ఉంటుంది’’ అని ఆయన అన్నారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన తర్వాత పశ్చిమ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించాయి. కానీ భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు భారీ మొత్తంలో తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తున్నాయి. ఇది రష్యా యుద్ధ నిధికి దోహదపడుతోందని అమెరికా ఆరోపిస్తోంది.


గతంలో బైడెన్ ప్రభుత్వం చమురు విషయంలో చూసీచూడనట్టు వ్యవహరించినప్పటికీ, ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకార సుంకాలను ప్రకటించి వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. ఇక, ట్రంప్ విధానాన్ని ప్రపంచ నెం.1 గోల్ఫర్ స్కాటీ షెఫ్లర్‌తో గ్రాహాం పోల్చారు. ‘ట్రంప్ అమెరికన్ రాజకీయాల్లో స్కాటీ షెఫ్లర్ లాంటి వారు. మీ మీద పెనుదాడి చేయబోతున్నారు’” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధ సరఫరా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘మేము ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేస్తున్నాం.. కాబట్టి పుతిన్‌తో పోరాడటానికి ఉక్రెయిన్ వద్ద ఆయుధాలు ఉంటాయి’’ అని గ్రాహామ్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa