తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో నూతన శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం ప్రారంభించింది. భక్తులకు మరింత సౌకర్యంగా శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేయాలనే ఉద్దేశంతో.. అన్నమయ్య భవనం ఎదురుగా నూతన శ్రీవాణి దర్శన టికెట్ల కేంద్రాన్ని టీటీడీ ప్రారంభించింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు చేతుల మీదుగా మంగళవారం దీనిని ప్రారంభించారు. శ్రీవాణి దర్శన టికెట్ల కోసం వచ్చే భక్తులు ఉదయం ఐదింటి నుంచే క్యూలైన్లలో నిల్చునేవారు. అయితే క్యూలైన్ల బాధ తప్పించేలా సౌకర్యవంతంగా శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేసేందుకు నూతన శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటు చేశారు.
60 లక్షలు ఖర్చుచేసి అత్యాధునిక సదుపాయాలతో టీటీడీ ఈ నూతన కౌంటర్లు నిర్మించింది. బుధవారం నుంచి ఈ కౌంటర్ల ద్వారా భక్తులకు టికెట్ల పంపిణీ ప్రారంభమవుతుంది. మరోవైపు గతంలో టీటీడీ ఏఈవో కార్యాలయంలో శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం ఉండేది. అయితే శ్రీవాణి దర్శన టికెట్ల కోసం వచ్చే శ్రీవారి భక్తులు, వీఐపీ లేఖలతో వచ్చే భక్తులతో ఇబ్బందులు ఎదురయ్యేవి. దీంతో అన్నమయ్య భవనం ఎదురుగా కొత్తగా శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటు చేశారు.
ఇక్కడికి శ్రీవాణి దర్శన టికెట్ల కోసం వచ్చే భక్తులకు కాఫీ, టీ, పాలు, మంచినీరు పంపిణీ చేయనున్నారు. అలాగే శ్రీవాణి టికెట్ల సమాచారాన్ని డిజిటల్ స్క్రీన్ల సాయంతో భక్తులకు తెలియజేయాలని టీటీడీ ఈవో ఇటీవల అధికారులను ఆదేశించారు.
మరోవైపు ఆహార నాణ్యతను పరీక్షించేందుకు తిరుమలలో కొత్తగా ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ను టీటీడీ ఛైర్మన్, టీటీడీ ఈవో మంగళవారం ప్రారంభించారు. గతంలో శ్రీవారి ప్రసాదాలు, నెయ్యి లాంటి వస్తువుల నాణ్యతను పరీక్షించాలంటే ఇతర రాష్ట్రాలకు శాంపిల్స్ పంపించాల్సి ఉండేదని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.. కానీ ఇప్పుడు తిరుమలలోనే అత్యాధునిక పరికరాలతో ల్యాబ్ను ఏర్పాటు చేసుకున్నట్లు వివరించారు. ఈ ల్యాబ్ అందుబాటులోకి రావటంతో తిరుమలలో తొలిసారిగా నెయ్యిలో కల్తీ శాతం, నాణ్యత శాతం విశ్లేషించే అవకాశం వచ్చిందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
గ్యాస్ క్రోమాటోగ్రాఫ్ , హై పెర్ఫామెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రాఫ్ వంటి పరికరాలతో నెయ్యిలో కల్తీ శాతం, నాణ్యత శాతం విశ్లేషించవచ్చని వివరించారు. రూ.75 లక్షలు విలువ చేసే ఈ పరికరాలను గుజరాత్కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు టీటీడీకి విరాళంగా అందించింది. మరోవపైు ఇకపై తిరుమల శ్రీవారి ప్రసాదాల నాణ్యతను ఈ ల్యాబ్లో పరిశీలించి వెంటనే ఫలితాలు అందించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa