కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డికి టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే మాధవి రెడ్డి ముఖ్య అనుచరుణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఫిర్యాదుతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి అనుచరుడిపై టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే మాధవి రెడ్డి ముఖ్య అనుచరుడైన తిరుమలేశ్ అనే వ్యక్తి.. ఎమ్మెల్యే పేరు చెప్పి విద్యాసంస్థల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
అలాగే కడపలో ఇటీవల టీడీపీ మహానాడు కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. మహానాడు సందర్భంగా కూడా తిరుమలేశ్ ఎమ్మెల్యే పేరుతో వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. ఈ క్రమంలో పురపాలక శాఖ మంత్రి నారాయణకు చెందిన.. నారాయణ విద్యాసంస్థల నుంచి కూడా తిరుమలేశ్ డబ్బుల వసూళ్లకు యత్నించినట్లు తెలిసింది. దీంతో మంత్రి నారాయణ ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయగా.. టీడీపీ అధిష్టానం తిరుమలేశ్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు ఏప్రిల్ నెలలోనూ ఎమ్మెల్యే మాధవి రెడ్డి పీఏపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.మాధవి రెడ్డి పీఏ వాహిద్.. ఉద్యోగం పేరుతో ఒంటరి మహిళను మోసం చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రెండో పెళ్లి చేసుకున్నాడని.. మరో ముగ్గురు అమ్మాయిలను కూడా వాహిద్ ఇలా మోసం చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో మాధవి రెడ్డి స్పందించారు. వాహిద్ను విధుల నుంచి తొలగించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
మరోవైపు రెడ్డెప్పగారి మాధవి రెడ్డి .. తన భర్త, టీడీపీ సీనియర్ లీడర్ రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు. 2023లో కడప అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జిగా నియమితులయ్యారు. 2024 ఎన్నికల్లో కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్డెప్పగారి మాధవి రెడ్డి.. తన సమీప వైసీపీ అభ్యర్థి అంజాద్ భాషాపై 18,860 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తన దూకుడైన ధోరణితో కడప రెడ్డెమ్మగా మాధవి రెడ్డి పేరుతెచ్చుకున్నారు. అలాగే ఆడపులి అంటూ సీఎం నారా చంద్రబాబు కూడా మాధవి రెడ్డిని అభినందించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa