"నా భార్య సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, ఆమెతో ఇక నా సంబంధం ఉండదు" అని ఓ భర్త తన ఇష్టాన్ని రాతపూర్వకంగా వెల్లడించాడు. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్నగర్ జిల్లాకు చెందిన రామ్ చరణ్ (47).. తన భార్య జానకీదేవి (40)ని ఆమె ప్రియుడు సోను ప్రజాపతి (24)తో కలిసి జీవించేందుకు స్వయంగా అనుమతించిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బంధాలు, త్యాగం, వ్యక్తిగత స్వేచ్ఛపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.పర్సాముర్తా గ్రామానికి చెందిన రామ్ చరణ్, జానకీదేవి వివాహం 20 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రామ్ చరణ్ ముంబయిలో టైల్స్ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, జానకి ఇంటి వద్ద పిల్లల బాధ్యతలను చూసుకునేది.నాలుగేళ్ల క్రితం జానకికి సమీప గ్రామానికి చెందిన దినసరి కూలీ సోను ప్రజాపతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. సుమారు ఏడు నెలల పాటు వారిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉన్నారు. ఈ విషయం రామ్ చరణ్కు తెలిసి నిలదీస్తే జానకి క్షమాపణ చెప్పింది. దీంతో ఆమెను క్షమించి కొంతకాలం ఆమెతో కలిసి జీవించాడు.అయితే, కొన్నాళ్లకు జానకీ మళ్లీ సోను వద్దకు వెళ్లడంతో ఆమె అదృశ్యమైనట్టు భవానీగంజ్ పోలీస్ స్టేషన్లో రామ్ చరణ్ ఫిర్యాదు చేశాడు. కానీ, ఈ నెల 20న రామ్ చరణ్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు.జానకి తన ప్రియుడు సోనుతో జీవించడానికి ఇష్టపడుతోందని, తాను ఆమెతో ఇక కలిసి ఉండలేనని రాతపూర్వక ఒప్పందం ద్వారా పోలీసులకు తెలిపాడు. "గతంలో ఆమెను క్షమించాను, కానీ ఇప్పుడు ఆమె నన్ను ఏదైనా చేస్తుందని భయంగా ఉంది" అని రామ్ చరణ్ వివరించాడు. ఈ మాటలు అతని ఆవేదనను, నిస్సహాయతను స్పష్టం చేస్తున్నాయి. భార్య సంతోషానికే ప్రాధాన్యం ఇస్తూ రామ్ చరణ్ ఒక మహత్తర త్యాగానికి పూనుకున్నాడు.ఈ నిర్ణయం స్థానిక సమాజంలో వివాహ సంబంధాలు, వ్యక్తిగత స్వేచ్ఛపై కొత్త చర్చను రేకెత్తించింది. ఒక భర్త తన భార్య సంతోషం కోసం ఇంతటి త్యాగం చేయడం అరుదైన విషయంగా అందరూ పరిగణించారు. భవానీగంజ్ పోలీసులు ఈ విషయంలో ఎలాంటి చట్టపరమైన సమస్యలు లేవని, ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa