ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్యాక్స్ పేయర్లపై 'ఏఐ' నిఘా.. ఇక తప్పించుకోలేరు

business |  Suryaa Desk  | Published : Thu, Jul 24, 2025, 09:18 PM

ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారు తమ ఐటీ రిటర్నులు ఫైల్ చేస్తున్నారు. అయితే, గతంలో కంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే నిబంధనలు పాటించేలా, తప్పుడు వ్యవహారాలను గుర్తించేందుకు ఐటీ శాఖ చర్యలు చేపట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ సాయంతో ట్యాక్స్ పేయర్ల తీరుతెన్నులను పరిశీలిస్తున్నామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఛైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. ట్యాక్స్ పేయర్లు రూల్స్ పాటించేలా ఐటీ విభాగం వారి ఆన్‌లైన్ కార్యకలాపాలను, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను, ఐటీ రిటర్నుల దాఖలు నమూనాలను విశ్లేషిస్తున్నట్లు చెప్పారు.


ట్యాక్స్ పేయర్లు, కంపెనీల ఆర్థిక లావాదేవీల వివరాలు వార్షిక సమాచార నివేదిక (AIS)లో ఉంటాయి. ఐటీ రిటర్నులు ఫైల్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి ఎన్నిసార్లు తన ఏఐఎస్ యాక్సెస్ చేస్తున్నారు అనేది చూస్తున్నట్లు సీబీడీటీ ఛైర్మన్ చెప్పారు. సగటున 3.5 సార్లు ఏఐఎస్ పోర్టల్ సందర్శిస్తున్నారని చెప్పారు. గతేడాది 650 కోట్లకుపైగా ట్రాన్సాక్షన్లకు సంబంధించి 40 కోట్ల ఏఐఎస్ డాక్యుమెంట్లు జెనరేట్ అయితే కేవలం 9 కోట్ల ఐటీ రిటర్నులు ఫైల్ చేసినట్లు చెప్పారు. ఐటీఆర్ ఫైల్ చేయకుండా ఏఐఎస్ యాక్సెస్ చేయడం అనేది ఫైలింగ్ ఇబ్బందులు, పన్ను చెల్లింపుదారుల ఇతర ఉద్దేశాలను సూచిస్తోందన్నారు. ఈ క్రమంలో వారికి ఈ-మెయిల్, మెసేజ్‌ల ద్వారా సమాచారం అందిస్తూ సాయం చేస్తున్నట్లు చెప్పారు.


పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించి ఐటీ రిటర్నులు దాఖలు చేయని, లేదా ఫైలింగ్‌లో తప్పులు చేసే వారిని గుర్తించేందుకు ఏఐ ఆధారిత డేటా విశ్లేషణ ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. పన్ను మినహాయింపులు, డిడక్షన్లకు సంబంధించి తప్పుడు క్లెయిమ్స్ చేస్తే సైతం ఏఐ గుర్తిస్తుందన్నారు. ఇప్పటికే మోసపూరిత క్లెయిమ్స్ చేసిన 1.5 లక్షలకు పైగా పాన్ కార్డులను గుర్తించినట్లు చెప్పారు. అయితే, చాలా వరకు మధ్యవర్తులు తప్పుదోవ పట్టించడం కారణంగానే జరుగుతున్నట్లు భావిస్తున్నామన్నారు.


పన్ను చెల్లింపుదారులు స్వచ్ఛందంగా రూల్స్ పాటించేలా తాము తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా విదేశీ ఆస్తుల సమాచారం ఆధారంగా 19501 మంది ట్యాక్స్ పేయర్లను సంప్రదించినట్లు గుర్తు చేశారు. దీని ఫలితంగా 62 శాతం మంది తమ రిటర్నులను అప్డేట్ చేశారని తెలిపారు. రూ.29,208 కోట్ల విదేశీ ఆస్తులు, రూ.1089 కోట్ల విదేశీ ఆదాయాలను వెల్లడించినట్లు తెలిపారు.


డిజిటల్ సహకారాన్ని ఐటీ శాఖ బలోపేతం చేస్తోంది. అయినప్పటికీ తప్పుడు, తాత్కాలిక వివరాలు ఒక సవాల్‌గా మారుతున్నాయి. చాలా వరకు మెయిల్స్, అడ్రస్‌లు ఏజెంట్లు, మధ్యవర్తులవేనని తేలడం ఆందోళన కలిగిస్తోందని ఐటీ శాఖ చెబుతోంది. ట్యాక్స్ పేయర్లు, ఐటీ శాఖ మధ్య సమాచారా మార్పిడి సజావుగా సాగేందుకు, సేవల ప్రభావాన్ని మెరుగుపరిచేందుకు, సరైన వివరాలు ఇవ్వాలని సీబీడీటీ ఛైర్మన్ రవి అగర్వాల్ చెప్పారు. ఐటీ శాఖ చేపడుతోన్న చర్యలు ట్యాక్స్ పేయర్లను శిక్షించేందుకు కాదని, వారిలో అవగాహన పెంచి, సరైన లెక్కలతో ఐటీ రిటర్నులు ఫైలింగ్ చేసేందుకేనన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa