ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ మెట్రో ప్రాజెక్టుపై బిగ్ అప్‌డేట్.. టెండర్ షెడ్యూల్ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 08:17 PM

విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. విశాఖ మెట్రో ఫేజ్ -1 పనుల కోసం ఈపీసీ ప్రాతిపదికన టెండర్లు పిలిచింది. మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ మేరకు.. టెండర్ షెడ్యూల్ విడుదల చేసింది. విశాఖ మెట్రో ఫేజ్ -1పనులను మూడేళ్ల కాలపరిమితితో పూర్తి చేయాలని టెండర్ షెడ్యూలులో పేర్కొన్నారు. మరోవైపు టెండర్ సమర్పించిన 180 రోజుల వరకూ బిడ్ వ్యాలిడిటీ ఉంటుందని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు రూ.11,498 కోట్లతో చేపట్టనున్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో యాభై శాతం చొప్పున వాటా భరించనున్నాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు రాష్ట్రం వాటా కింద వీఎంఆర్డీఏ నుంచి రూ.4,101 కోట్లు కేటాయించనున్నారు.


విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టును మొత్తం 140.13 కి.మీ.లలో చేపట్టాలనేది ప్రతిపాదన. అయితే తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. 42 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. డబుల్‌ డెక్కర్ తరహాలో విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మించనున్నారు. మొదటి దశలో మూడు కారిడార్లలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మించనున్నారు. ఇందులో 20.16 కి.మీ డబుల్‌ డెక్కర్‌ తరహాలో ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం, గాజువాక నుంచి స్టీల్‌ప్లాంట్‌ వరకూ పై వంతెనలు నిర్మిస్తారు. కొమ్మాది- స్టీలుప్లాంటు, గురుద్వారా-పాతపోస్టాఫీసు, తాటిచెట్లపాలెం-చినవాల్తేరు కారిడార్లలో తొలి దశ కింద మెట్రోకు ప్రణాళిక చేశారు.


కొమ్మాది-స్టీల్‌ప్లాంటు మధ్య ఏర్పాటు చేసే 34.40 కిలోమీటర్ల కారిడార్లో డబుల్‌ డెక్కర్‌ ట్రాక్‌ నిర్మించనున్నారు. అలాగే మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు 15.06 కి.మీ. మేర రెండో కారిడార్‌ను నిర్మిస్తారు. గాజువాక నుంచి స్టీల్‌ప్లాంటు మధ్య మరొక కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును రూ.10,118 కోట్లతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 భాగస్వామ్యంతో చేపట్టనున్నాయి. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సీఆర్డీఏ నుంచి రూ.3,497 కోట్లు కేటాయించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa