ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిబ్బంది వాట్సాప్ గ్రూపులో ఆ ఫోటోలు..గవర్నమెంట్ ఉద్యోగి నిర్వాకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 08:22 PM

పనిచేసే చోట మహిళా ఉద్యోగుల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. అయినా కూడా అక్కడక్కడా కొన్ని దారుణమైన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుంది. ఓ మహిళా ఉద్యోగి అశ్లీల చిత్రాలను వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడో అధికారి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు జిల్లాలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో (మెప్మా) పనిచేసే వ్యక్తి ఒకరు ఈ దారుణ చర్యకు పాల్పడ్డారు. ఓ మహిళా రిసోర్స్ పర్సన్ అశ్లీల చిత్రాలను.. ఉద్యోగులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. గత సోమవారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. వాట్సాప్ గ్రూపులో ఈ అశ్లీల చిత్రాలను చూసిన మెప్మా సిబ్బంది షాక్ తిన్నారు. వెంటనే ఈ విషయాన్ని సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియజేశారు. అలాగే మెప్మా ఎండీ తేజ్ భరత్‌కు కూడా ఫిర్యాదు చేశారు.


దీంతో ఆ అధికారి తీరుపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ జరిపించారు. అనంతరం వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. అయితే బదిలీ అయిన ప్రాంతంలో ఆ అధికారి ఇంకా విధుల్లో చేరకపోవటంతో ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సదరు అధికారి గతంలోనూ ఇలాగే వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారని.. అయితే మళ్లీ తిరిగి గుంటూరులోనే పోస్టింగ్ వేయించుకున్నారని చెప్తున్నారు. ఈసారి కూడా అలాగే తిరిగి గుంటూరుకు రాకుండా చూడాలని.. అలాగే కఠిన చర్యలు తీసుకోవాలని మెప్మాలోని మహిళా ఉద్యోగులు కోరుతున్నారు.


మహిళా ఉద్యోగుల భద్రత కోసం ఐసీసీ..


మరోవైపు పని ప్రదేశాలల్లో మహిళా ఉద్యోగుల భద్రత కోసం గుంటూరు జిల్లాలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను (ఐసీసీ) ఏర్పాటు చేస్తున్నారు. పనిచేసే చోట ఉద్యోగులను ఇబ్బంది పెట్టినా.. లైంగికంగా వేధించిన చట్ట ప్రకారం శిక్షించేలా ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు పనిచేస్తాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు మొదటగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రైవేట్ రంగానికి కూడా విస్తరించే ఆలోచనలో గుంటూరు జిల్లా అధికారులు ఉన్నారు.


కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ప్రకారం.. పదిమందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలలో ఐసీసీలు తప్పనిసరి. అవి ప్రభుత్వ కార్యాలయాలైనా, ప్రైవేట్ సంస్థలైనా సరే. అందులో ఒక్క మహిళా ఉద్యోగి ఉన్నా కూడా అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు తప్పనిసరి. అయితే ఈ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తొలుత ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ నిర్ణయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa