ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు (శ్రామికులు) కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రూ.605 కోట్ల వేతన బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం మరో రెండు, మూడు రోజుల్లో జమకానుంది. గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్నవారికి కేంద్రం రూ.2,500 కోట్లకు పైగా వేతనాలు చెల్లించాల్సి ఉంది. గ్రామీణ ఉపాధి హామీ శ్రామికులకు 2025 మే 28 తర్వాత కేంద్రం ఇప్పటి వరకూ వేతనాలు విడుదల చేయలేదు. ఈ క్రమంలోనే బకాయిలు చెల్లించాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఏపీ ప్రభుత్వం ఇటీవల లేఖ రాసింది. దీంతో రూ.605 కోట్లను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. మిగతా మొత్తాన్ని దశలవారీగా విడుదల చేయనున్నారు.
మరోవైపు ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నియమ నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఉపాధి హామీ పథకంలోని కూలీలకు ఇకపై డబ్బులు రావాలంటే.. రోజూ రెండుసార్లు ఫోటో తీసి ఆన్లైన్లో పెట్టాల్సి ఉంటుంది. పని ప్రదేశంలో ఉదయం, సాయంత్రం కూలీలను రెండుసార్లు ఫొటో తీసి ఆన్లైన్లో ఉంచాల్సి ఉంటుంది. ఈ ఫోటోలను నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటలకు మొదటి ఫోటో.. సాయంత్రం 4 గంటలకు రెండో ఫోటో తీసి అప్లోడ్ చేయాలని కేంద్రం సూచించింది.
మరోవైపు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ కూలీల ఫోటోలు తీస్తారు. ఆ ఫోటోలను పంచాయతీ సెక్రటరీలు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీనిపై ఎంపీడీవోకు నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే మండల స్థాయి అధికారులు ఎన్ని ఫొటోలను సరిగ్గా తీశారు, ఎన్ని ఫోటోలను సరిగా తీయలేదనేదీ సరిచూడాల్సి ఉంటుంది. ఇలా అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాటిలో 20 శాతం వివరాలను మండలస్థాయి అధికారులు.. జిల్లా అధికారులకు పంపించాలి. జిల్లా ఆఫీసులో ప్రతి ఫొటోను జాగ్రత్తగా భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులలో స్పష్టం చేసింది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల వాసుల కోసం ప్రవేశపెట్టారు. గ్రామీణ పేదల జీవనోపాధిని పెంచడంలో భాగంగా వారికి పని కల్పించేందుకు.. వ్యవసాయ పనులు లేనప్పుడు వారికి ఆదాయాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకంలో భాగంగా చెరువులు, కాలువలు, నీటి సంరక్షణ నిర్మాణాలు చేపడుతారు. అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నియంత్రించేందుకు ఈ పథకం తెచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa