ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐదేళ్లలో 21 సెంచరీలు,,,,సచిన్ రికార్డుకు అతి చేరువలో ఇంగ్లండ్ లెజెండ్ జో రూట్

sports |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 11:05 PM

ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు జో రూట్ టెస్టు క్రికెట్‌లో తన హవా కొనసాగిస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డుల కోటను రూట్ కొల్లగట్టేశాడు. అటు పరుగులు.. ఇటు సెంచరీలు ఒక్కో రికార్డును అధిగమిస్తూ రికార్డుల రారాజు సచిన్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. మాంచెస్టర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పలు రికార్డులు నమోదు చేశాడు.


జో రూట్ గడిచిన ఐదేళ్లలో ఏకంగా 21 టెస్టు సెంచరీలు నమోదు చేశాడు. 2021 నుంచి ఇప్పటి వరకు రూట్ టెస్టు క్రికెట్‌లో తన సత్తా చాటాడు. 2021లో ఆరు సెంచరీలు చేసిన రూట్, 2022లో ఐదు శతకాలు నమోదు చేశాడు. 2023లో మాత్రమే కేవలం రెండు సెంచరీలు చేశాడు. 2024లో అత్యధికంగా ఆరు సెంచరీలు బాదగా, ఈ ఏడాది భారత్‌తో జరుగుతున్న అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో రెండు శతకాలు నమోదు చేశాడు. లార్డ్స్‌లో ఒకటి, మాంచెస్టర్‌‌లో రెండోది.


టెస్టుల్లో 38వ శతకాన్ని నమోదు చేసిన జో రూట్.. ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచాడు. శ్రీలంక మాజీ లెజెండ్ కుమార సంగక్కర కూడా 38 శతకాలు బాదగా.. అతనితో సరిమానంగా ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతో టాప్ ప్లేస్‌లో ఉండగా, జాక్ కల్లీస్ 45, రికీ పాంటింగ్ 41 సెంచరీలతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. భారత్‌పై జో రూట్‌కి ఇది 12వ శతకం. టెస్టుల్లో టీమిండియాపై అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా కూడా జో రూట్ రికార్డు సృష్టించాడు. రూట్ తర్వాత స్టీవ్ స్మిత్ 11 శతకాలు చేయడం విశేషం.


ఫ్యాబ్ ఫోర్ ఆటగాళ్లలో ఎక్కువ టెస్టు శతకాలు నమోదు చేసిన ఆటగాడిగా కూడా జో రూట్ నిలిచాడు. రూట్ 38, స్టీవ్ స్మిత్ 36, విలియమ్సన్ 33, కోహ్లి 30 శతకాలతో ఉన్నారు. విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా వన్డేల్లో కొనసాగుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో చూస్తే ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లి 82 సెంచరీలతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. జో రూట్ 56 సెంచరీలు చేయగా, రోహిత్ శర్మ 49, కేన్ విలియమ్సన్ 48, స్టీవ్ స్మిత్ 48 శతకాలు నమోదు చేశారు.


టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఈ ఒక్క రోజే ముగ్గురు ఆటగాళ్లను అధిగమించి జో రూట్ రెండో స్థానానికి ఎగబాకాడు. మాంచెస్టర్ టెస్టుకు ముందు ఆరో స్థానంలో ఉన్న రూట్.. ఈ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడంతో రాహుల్ ద్రవిడ్ (13,288), జాక్ కల్లీస్ (13,289), రికీ పాంటింగ్ (13,378)ను అధిగమించి 13400కు పైగా పరుగులతో రెండో స్థానానికి వచ్చాడు. సచిన్ టెండూల్కర్ 15,921 పరుగులతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. సచిన్ రికార్డును బ్రేక్ చేయాలంటే ఇంకా 2500కు పైగా పరుగులు చేయాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa