ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై ఇంటి వద్ద నుంచే..ప్రజల కోసం తపాలా శాఖ కొత్త సేవలు అందుబాటులోకి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 28, 2025, 07:49 PM

ప్రజల కోసం తపాలా శాఖ కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఒకప్పుడు రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్టు వంటివి పంపాలంటే పోస్టాఫీసుకు వెళ్లాల్సి ఉండేది. కానీ తపాలా శాఖ ఈ సేవలను మరింత సులభతరం చేసింది. ఇంటి వద్ద నుంచే రిజిస్టర్ పోస్టులు, స్పీడ్ పోస్టులు పంపే అవకాశం అందుబాటులోకి తెచ్చింది. ఇంటి వద్ద నుంచే బుకింగ్ చేసుకుంటే తపాలా శాఖ సిబ్బంది వీటిని కలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత చేరవేయాల్సిన అడ్రస్‌కు చేరవేస్తారు. అలాగే మరింత మెరుగైన సేవలు అందించేందుకు తపాలా శాఖ డాక్ పే, పోస్ట్ ఇన్ఫో యాప్ వంటి సేవలను కూడా తీసుకువస్తోంది.


రోజులు మారిపోతున్నాయి. టెక్నాలజీ అన్ని రంగాల్లోకి ప్రవేశించింది. మరీ ముఖ్యంగా సాంకేతికత కారణంగా సేవల రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా బ్యాంకుల వరకూ వెళ్లాల్సి వచ్చేది. కరెంట్ బిల్లు కట్టాలంటే కరెంట్ ఆఫీసు వద్ద క్యూ కట్టే పరిస్థితి. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి. సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు సమస్త ప్రపంచం మన చేతిలో ఉన్నట్లే. ఈ విషయాన్ని గ్రహించి తపాలా శాఖ అధికారులు ప్రజలు, వినియోగదారుల కోసం కొత్త సేవలు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ క్రమంలోనే తపాలా 2.0. విధానం పోస్టాఫీసుల్లో అమల్లోకి వచ్చింది. ఈ కొత్త విధానంలో టెక్నాలజీ సాయంతో తపాలా సేవలు మరింత వేగంగా అందించనున్నారు.


మరోవైపు గతంలో స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టు వంటివి చేయాలంటే పోస్టాఫీసును వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. స్పీడ్ పోస్టు, రిజిస్టర్‌ పోస్ట్ సహా అన్ని రకాల పార్శిల్స్‌ సేవలను ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే పోస్టుమెన్ సాయంతో ఇంటి వద్ద నుంచే పార్శిల్ పంపేందుకు వీలుంది. ఇంటిగ్రేటెడ్‌ మొబైల్‌ సేవల సాయంతో ఈ సర్వీసులు నామమాత్రపు రుసుముతో ఇళ్ల వద్ద నుంచే పొందే వీలుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీసుల నుంచి కూడా డిజిటల్ లావాదేవీలు నిర్వహించవచ్చు. ఇందుకోసం డాక్ పే యాప్ అందుబాటులో ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇంటర్నెట్ లేకపోయినా కూడా డిజిటల్ చెల్లింపులు చేసేలా డాక్ పే యాప్ రూపొందించారు.


అలాగే పోస్టాఫీసులో ఎలాంటి సేవింగ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయనే వివరాలను పోస్ట్‌ ఇన్ఫో యాప్‌ ద్వారా తెలుసుకోవచ్ఛు. అలాగే తపాలా శాఖ అందించే సేవలలో ఏవైనా లోపాలు ఉంటే.. పోస్ట్‌ ఇన్ఫో యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఆ రకంగా ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేలా, పారదర్శకంగా సేవలు నిర్వహించేలా.. అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో తపాలా 2.0. సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఈ సేవలపై వినియోగదారులకు, సామాన్య ప్రజానీకానికి అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సేవలన్నీ ఆగస్ట్ నెల నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని తపాలా శాఖ అధికారులు చెప్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa