ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడెందుకు రాలేదు? జస్టిస్ వర్మకు సుప్రీంకోర్టు సూటి ప్రశ్న

national |  Suryaa Desk  | Published : Mon, Jul 28, 2025, 08:16 PM

ఢిల్లీనివాసంలో భారీగా నగదు వెలుగుచూసిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇలాంటి పిటిషన్ వేయకుండా ఉండాల్సిందని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. త్రిసభ్య కమిటీ దర్యాప్తును సవాల్ చేశారు కాబట్టి.. తొలి ప్రతివాది సుప్రీం కోర్టే అవుతుందని పేర్కొన్నారు.


‘‘పార్టీగా రిజిస్ట్రార్ జనరల్‌ను ఎంచుకోవడం సరైంది కాదు. మీ అసలు సమస్య సుప్రీంకోర్టు చర్యలపై ఉంది. అయితే మీరు అసలు పక్షంగా సుప్రీంకోర్టును పెట్టలేదు.. దర్యాప్తు కోసం కమిటీని నియమించినప్పుడే మీరు ఎందుకు సుప్రీంకోర్టుకు రాలేదు..? ఇన్నాళ్లు ఎందుకు వేచి చూశారు..? ఈ విచారణలకు న్యాయమూర్తులు గతంలో హాజరుకాలేదు. మీరు ఎందుకు హాజరయ్యారు..?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి జస్టిస్ వర్మ తరఫున హాజరైన సీనియర్ లాయర్ కపిల్ సిబల్. ఆ సొమ్ము ఎవరితో తెలుసుకోవచ్చని భావించడం వల్లే కమిటీ ముందు హాజరయ్యారని చెప్పారు.


అంతేకాదు, తన క్లయింట్ ఔట్‌హౌస్‌లో లభ్యమైన సొమ్ము ఆయనదే అని ఎలా చెబుతారని సిబల్ ప్రశ్నించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ..‘‘పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సమక్షంలోనే నగదు దొరికింది’ అని పేర్కొంది..అయితే, న్యాయమూర్తి సిబ్బంది అక్కడ లేరని సిబల్‌ బదులివ్వడంతో కమిటీ నివేదిక సరైంది కాదని అంటున్నారా..? అని కోర్టు ప్రశ్నించింది. తన ఉద్దేశం అది కాదని సిబల్ తెలిపారు.


ఈ సందర్భంగా భారత రాజ్యాంగంలో న్యాయమూర్తుల తొలగింపునకు సంబంధించిన ప్రక్రియను సిబల్ వివరించారు. ‘‘రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తిని తొలగించాలంటే అనుచిత ప్రవర్తన లేదా అవినీతిని నిరూపించాల్సి ఉంటుంది.. ఎటువంటి ఆధారాలు లేకండా ఆయన ప్రవర్తనను లోకసభ లేదా రాజ్యసభలో చర్చించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయవ్యవస్థే ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేయడం రాజ్యాంగ విరుద్ధం.. అలాగే మీడియా ఆరోపణలు, జడ్జీలపై ఆడియో టేపుల విడుదల, బహిరంగ చర్చలు అన్నీ నిషేధితమే. ఇవి రాజ్యాంగ ప్రాథమిక మూలాలను ఉల్లంఘిస్తున్నాయి’’ అని అన్నారు.


త్రిసభ్య కమిటీ నివేదిక పిటిషన్‌లో జత చేయలేదా? అని జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రశ్నించగా.. అది పబ్లిక్ డొమెయిన్‌లో ఉందని సిబల్ సమాధానం ఇచ్చారు. దానిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘అయితే ఏం? మీరు పిటిషన్‌లో జతచేయాల్సిందే!’ అని స్పష్టం చేశారు. అలాగే, ప్రధాని, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అభిశంసనకు సిఫార్సు చేశారా? ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం ఈ పిటిషన్ విచారణను జులై 31కి వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa