జర్మనీలోని నైరుతి ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. 100 మందికి పైగా ప్రజలతో వెళ్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఫలితంగా అందులోని ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 34 మంది వరకు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం గుర్తించిన అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.
జర్మనీలోని బాడెన్-వుర్టెంబర్గ్ రాష్ట్రంలోని రీడ్లింగెన్ సమీపంలో ఆదివారం నాడు సుమారు వంద మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రాంతీయ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ముఖ్యంగా రెండు బోగీలు ఒక్కసారిగా పట్టాలు తప్పినట్లు నేరుగా అధికారులే వెల్లడించారు. విషయం గుర్తించిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. తాము వెళ్లే సరికే ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని.. మొత్తంగా 34 మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ప్రస్తుతం దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే జర్మన్ మీడియా నివేదికల ప్రకారం.. ఇటీవల ఈ ప్రాంతంలో సంభవించిన తీవ్రమైన తుఫానులు, భారీ వర్షాల కారణంగా ఏర్పడిన కొండచరియలు విరిగిపడటమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా రైలు పట్టాలపై మట్టి, రాళ్లు పడటంతోనే ఈ విషాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై జర్మన్ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెర్జ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన.. సహాయక చర్యల్లో నిమగ్నమైన అత్యవసర సేవల సిబ్బందికి అన్ని విధాలా మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ రైలు ప్రమాదం జర్మనీ రైల్వే మౌలిక సదుపాయాలపై దీర్ఘకాలంగా ఉన్న విమర్శలను మరోసారి తెరపైకి తెచ్చింది. దేశంలోని కొన్ని రైలు మార్గాలు, వంతెనలు, ఇతర మౌలిక వసతులు కాలం చెల్లినవని.. వాటి ఆధునీకరణ తక్షణ అవసరమని విశ్లేషకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాల ఆధునీకరణకు గణనీయమైన నిధులు కేటాయించినప్పటికీ.. ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. గతంలో కూడా జర్మనీలో పలు ఘోర రైలు ప్రమాదాలు సంభవించాయి. జూన్ 2022లో ఒక ఘోర ప్రమాదం జరగగా, 1998లో జరిగిన ప్రమాదం దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైనదిగా నమోదైంది. ఈ తాజా ప్రమాదం రైల్వే వ్యవస్థలో తక్షణ మార్పుల అవసరాన్ని మరోసారి నొక్కి చెబుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa