ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంత మంది పిల్లలున్నా సరే.. ఒక్కొక్కరికీ ఏటా రూ.43 వేలు

international |  Suryaa Desk  | Published : Tue, Jul 29, 2025, 09:46 PM

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కల్గిన దేశాల్లో రెండో స్థానంలో ఉన్న చైనా.. ప్రస్తుతం తీవ్రమైన జనాభా సోంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. తగ్గుతున్న జననాల రేటు, వేగంగా పెరుగుతున్న వృద్ధాప్యంతో.. చైనా దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాజిక భద్రతా వ్యవస్థకు పెను సవాలుగా మారుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శిశు సంరక్షణ సబ్సిడీలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నూతన విధానం కింద మూడు సంవత్సరాల లోపు ఉన్న ప్రతీ బిడ్డకు సంవత్సరానికి 500 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.43,000) అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సబ్సిడీని జనవరి 1 నుంచి వర్తించేలా అమలు చేసేందుకు ఇప్పటికే రంగం కూడా సిద్ధం చేసింది.


2024 నాటికి సగానికి పడిపోయిన జననాల సంఖ్య


ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, పిల్లలను పెంచడంలో కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించనుంది. ఫలితంగా జననాలను ప్రోత్సహించినట్లు అవుతుంది. చైనా జనాభా గత మూడు సంవత్సరాలుగా నిరంతరం తగ్గుతూ వస్తోంది. 2016లో ఒక బిడ్డ విధానాన్ని ముగించిన తర్వాత.. 2024లో జననాల సంఖ్య 2016 నాటి సగం స్థాయికి పడిపోయింది. ఇది దేశం ఎదుర్కొంటున్న జనాభా సంక్షోభ తీవ్రతను స్పష్టం చేస్తోంది. అయితే విశ్లేషకులు ఈ సబ్సిడీలు మాత్రమే జనాభా క్షీణతను తిప్పికొట్టడానికి లేదా దేశీయ వ్యయాన్ని గణనీయంగా పెంచడానికి సరిపోకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.


 స్థానిక ప్రభుత్వాలు సైతం..


కేటాయించిన మొత్తం చాలా తక్కువగా ఉందని వారు అభిప్రాయ పడుతున్నారు. అయినప్పటికీ గృహాలకు నేరుగా ఆర్థిక సహాయం అందించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణిస్తున్నారు. భవిష్యత్తులో మరింత ఆర్థిక సాయానికి ఇది మార్గం సుగమం చేస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే చైనాలోని కొన్ని స్థానిక ప్రభుత్వాలు జననాలను ప్రోత్సహించడానికి తమ సొంత సబ్సిడీ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. కొన్ని బహుళ సంతానం ఉన్న కుటుంబాలకు గణనీయమైన మొత్తాలను అందిస్తున్నాయి.


వృద్ధాప్యం వేగంగా పెరిగిపోవడం..


జనాభా తగ్గిపోవడంతో పాటు వేగంగా వృద్ధాప్యం పెరిగిపోవడం వల్ల చైనా పెన్షన్ వ్యవస్థ భవిష్యత్తుపై కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. యువ కార్మికుల కొరత భవిష్యత్తులో ఆర్థిక వృద్ధిని, ఉత్పాదకతను ప్రభావితం చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త సబ్సిడీ విధానం చైనా జనాభా సంక్షోభానికి ఒక ప్రారంభ పరిష్కారం మాత్రమే అని.. దీర్ఘకాలికంగా మరింత సమగ్రమైన విధానాలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa