జార్ఖండ్లోని దేవఘర్ జిల్లాలో మంగళవారం రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కన్వరియాలతో నిండిన ఒక బస్సు.. గ్యాస్ సిలిండర్లను రవాణా చేస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ భయానక ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 20 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు వివరిస్తున్నారు.
ఈ విషాదకర ఘటన మోహన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అటవీ ప్రాంతం సమీపంలో జరిగింది. తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు. అయితే విషయం గుర్తించిన స్థానికులు తమకు సమాచారం ఇవ్వగా.. హుటాహుటిన రంగంలోకి దిగినట్లు వెల్లడించారు. అంబులెన్సుల ద్వారా ముందుగా క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రులకు తరలించామన్నారు. అలాగే మృతదేహాలను సైతం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రులకు పంపినట్లు స్పష్టం చేశారు.
దుమ్కా జోన్ ఐజీ శైలేంద్ర కుమార్ సిన్హా ఈ ప్రమాదం గురించి మాట్లాడుతూ.. 32 సీట్లు ఉన్న బస్సులో 40 మందికి పైగానే కన్వరియాలు వెళ్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. అలాగే గ్యాస్ సిలిండర్లను మోసుకెళ్తున్న ట్రక్కుతో బస్సు ఢీకొనడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని అన్నారు. అయితే అదృష్టవశాత్తు.. ఆ సిలిండర్లు పేలకుండా ఉండటం కొంత వరకు ఊరటనిచ్చిందని చెప్పారు. పవిత్ర శ్రావణమాసం మూడో సోమవారం సందర్భంగా 3 లక్షలకు పైగా భక్తులు డియోఘర్లోని బాబాధామ్ ఆలయాన్ని సందర్శించినట్లు పేర్కొన్నారు. ఈ నెలంతా ఆలయానికి భక్తులు ఎక్కువగా వెళ్తుంటారని.. ప్రజలు అంతా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలని చెప్పారు.
మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని.. ప్రమాదంలో గాయపడిన చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వీలయినంత వరకు వారందరి ప్రాణాలు కాపాడేందుకు తాము ఎంతగానో కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రమాదాన్ని దేవఘర్ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కూడా ధృవీకరించారు. ఈ దుర్ఘటనలో 18 మంది కన్వరియాలు మరణించినట్లు ప్రకటించారు. వీరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే వారి కుటుంబాలకు ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు. అంతేకాకుండా క్షతగాత్రులకు అవసరమైన అన్ని రకాల సాయం చేస్తున్నామని చెప్పారు.
ఈ ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా స్పందించారు. ఈరోజు ఉదయం దేవఘర్ మోహన్పూర్ బ్లాక్లోని జమునియా చౌక్ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో బస్సులో.. 18 మంది భక్తులు మరణించిన అత్యంత బాధాకరమైన సమాచారం అందిందని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. మృతులందరికీ తాను సంతాపం తెలియజేస్తున్నట్లు వివరించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa